అరవై ఏళ్ల సమైక్య పాలనలో కనీసం సురక్షిత తాగునీరు ఎరుగని పల్లెలు ఎన్నో ఉన్నాయి. నాటి పాలకుల ముందుచూపు లేక గరళాన్ని మింగుతూ బతుకీడ్చాయి. సీజన్లో వానలు పడకుంటే ఒక్క సాగు సమస్యే కాదు, అంతకంటే పెద్దదైన తాగునీటి సమస్య తెలంగాణను పట్టి పీడించేది. ఈ దుస్థితి నుంచి ప్రజలను బయటపడేసి, ఆరోగ్య తెలంగాణను నెలకొల్పేందుకు బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన ‘భగీరథ’ యజ్ఞ ఫలాలు పల్లె పట్నం తేడా లేకుండా అందుకుంటున్నాయి. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా తరలివస్తున్న నీళ్లు ప్రజల గొంతుల్లో అమృతధారలై కురుస్తున్నాయి. ఎండాకాలంలోనూ గొంతెండకుండా చేసిన సీఎం కేసీఆర్ ముందుచూపుపై సర్వత్రా అభినందనల వర్షం కురుస్తున్నది.
– వరంగల్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వరంగల్, (నమస్తే తెలంగాణ)
వర్షాభావ పరిస్థితులు ఉంటే ఒక్క వ్యవసాయానికే పెద్ద సమస్య అని అంతా ఆలోచిస్తుంటారు. కానీ, అంతకంటే పెద్దదైన తాగునీటి సమస్య ఎదురవుతుంది. కాలం కాకుంటే జలాశయాల్లో నీరు తగ్గిపోయి తాగునీటి కటకట తలెత్తుతుంది. ఇలా ఉమ్మడి పాలనలో ముందు చూపు లేక తెలంగాణ గొంతు తడారేది. ఎండాకాలం వచ్చిందంటే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. అటు వ్యవసాయం, ఇటు తాగునీటి సమస్యను రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ ముందుచూపుతో కట్టిన ప్రాజెక్టుల ఫలాలను ఇప్పుడు తెలంగాణ అనుభవిస్తున్నది. ఈ సారి ఎండాకాలంలోనూ తీవ్ర ఎండల కారణంగా చాలా జలాశయాల్లో నీరు తగ్గిపోయింది. మిషన్ భగీరథ కింద అందించే నీరంతా ప్రాజెక్టుల్లో కేటాయించిన 10శాతం వాటా మీదే ఆధారపడి ఉంటుంది. కాళేశ్వరం ద్వారా నీరు అందకుంటే తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడి ఉండేది. మొత్తం తాగునీటి ఇన్టేక్ వెల్స్ కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల మీదే ఉన్నాయి. కాళేశ్వరం నీళ్లు రాకుంటే నీటి సమస్య ఎదురయ్యేది.
– వరంగల్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వరంగల్, (నమస్తే తెలంగాణ)
గోదావరి, కృష్ణల ద్వారా..
వరంగల్ జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా గోదావరి, కృష్ణా నదుల నీటి సరఫరా జరుగుతోంది. పాలేరు సెగ్మెంటు పరిధిలోని రాయపర్తి, నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల ప్రజలకు కృష్ణా నీరు అందుతోంది. గీసుగొండ, సంగెం మండలాల్లోని గ్రామాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు చేరుతోంది. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల ప్రజలకు కాళేశ్వరం నీళ్లు సరఫరా అవుతున్నాయి. వరంగల్ నగరంలో రైల్వే లైన్కు ఒక వైపున ఉన్న రామన్నపేట, మట్టెవాడ, ఎల్లంబజార్, మండిబజార్, వరంగల్చౌరస్తా, గిర్మాజీపేట, కాశీబుగ్గ, పోచమ్మమైదాన్, దేశాయిపేట, కొత్తవాడ, ఆటోనగర్ తదితర ప్రాంతాలకు దేవాదుల నీరు అందుతున్నది. అండర్ రైల్వే గేటు ప్రాంతంలోని ఉర్సు, కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేట, పెరికవాడ, శివనగర్, ఖిలావరంగల్, చింతల్, పుప్పాలగుట్ట, విలీన గ్రామాలకు కాళేశ్వరం జలాల సరఫరా జరుగుతోంది.
550 మీటర్ల ఎత్తుకు ఏగివచ్చి..
దక్కన్ పీఠభూమిలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంగా రికార్డు సొంతం చేసుకున్న చరిత్ర జనగామ జిల్లాలోని బచ్చన్నపేటది. సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తయిన ప్రాంతంగా..డార్క్ ఏరియాగా ముద్రపడి బోర్లువేయడం, ఇసుక తీయడానికి వీళ్లేని నిషేధాజ్ఞలకు గురైన అతి దుర్భిక్ష ప్రాంతం. ప్రస్తుతం ఎండాకాలంలోనూ ఇక్కడ చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మిషన్ భగీరథ కింద రూ. 840 కోట్లతో 1585.22 కిలోమీటర్ల పొడవునా మొయిన్ పైప్లైన్ నిర్మించి సిద్ధిపేట జిల్లా మల్లన్నసాగర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూపీసీ సెంటర్) ద్వారా జిల్లాలోని 611 ఆవాసాలు, 50 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు రోజూ 80 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) నీటి సరఫరా చేస్తున్నారు. ఇందులో చీటకోడూరు రిజర్వాయర్ నుంచి జిల్లా కేంద్రంలోని జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో మొత్తం 13,200 నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ 7.8 ఎంఎల్డీ నీటి సరఫరా అవుతున్నది. మిషన్ భగీరథ రాకముందు గ్రామాల్లో 342 ఓహెచ్ఎస్ఆర్లు(వాటర్ ట్యాంకులు) ఉండగా, భగీరథ పథకం వచ్చిన తర్వాత అదనంగా 489 ట్యాంకులు నిర్మించారు. 24 ఓహెచ్బీఆర్(ఓవర్ హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ల ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ల కోసం గ్రామాల్లో 1423.358 కిలోమీటర్ల పైపులైన్లు వేసి జిల్లాలో మొత్తం 1,21,009 నల్లా కనెక్షన్లు బిగించారు. ఇప్పటి వరకు జిల్లాలో మొయిన్గ్రిడ్ కోసం రూ.639.55కోట్లు, ఇంట్రావిలేజ్ అంతర్గత పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం కోసం రూ.178.78కోట్లు ఖర్చు చేసి 44 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు.
మహా నగరానికి మూడు నెలలు సరిపడా..
కాళేశ్వరం, దేవాదుల ఎత్తిపోతల ద్వారా వరంగల్ మహానగర ప్రజలకు ప్రతిరోజూ తాగునీటి సరఫరా జరుగుతున్నది. గతంలో వరంగల్ నగరానికి ఎల్ఎండీ ద్వారా తాగునీరు సరఫరా అయ్యేది. ఎల్ఎండీ నుంచి నగరంలోని వడ్డేపల్లి, భద్రకాళి జలాశయాలను నింపేవారు. ఎల్ఎండీ నీరు నగరానికి చేరుకోవడానికి వారం రోజులు పట్టేది. తెలంగాణ సర్కారు దేవాదుల నుంచి నేరుగా ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని తరలిస్తున్నది. దేవాదుల నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్కు 75 మిలియన్ క్యూబిక్ ఫీట్(ఎంసీఎఫ్టీ) నీటిని నింపుతున్నారు. 10 లక్షల జనాభా కలిగిన గ్రేటర్ కార్పొరేషన్కు తాగునీటిని సరఫరా చేస్తున్న ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం 29 ఫీట్ల లెవల్లో నీటి నిల్వలు ఉన్నాయి. గ్రేటర్ వరంగల్లో ప్రతిరోజూ ఆరున్నర మిలియన్ క్యూబిక్ ఫీట్(ఎంసీఎఫ్టీ)ల నీరు సరఫరా అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికతో మరో మూడు నెలలకు గ్రేటర్ అవసరాలకు సరిపడా నీళ్లు ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్నాయి.
కొత్తగా లక్షా 20వేల కనెక్షన్లు..
గ్రేటర్లో మిషన్ భగీరథ కింద కొత్తగా 1,20,335 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. గతంలో లక్షా 10 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కొత్తగా 1957 కిలోమీటర్ల పైప్లైన్ వేశారు. 33 ఓవర్ హెడ్ ట్యాంక్లను నిర్మించారు. కాళేశ్వరం జలాలు ఎల్ఎండీ నుంచి మల్లాపూర్లో నిర్మించిన (6600 మిలియన్ లీటర్స్ పర్ డే, ఎంఎల్డీ సామర్థ్యం) ట్యాంకుకు సరఫరా అవుతున్నాయి. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ధర్మసాగర్కు వస్తున్నాయి. ఇక్కడ నిర్మించిన మూడు ట్యాంకుల నుంచి ఇతర ప్రాంతాలకు తాగునీటి సరఫరా అవుతున్నది. 20 ఎంఎల్డీ ట్యాంకు నుంచి హసన్పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరుకు, 60 ఎంఎల్డీ ట్యాంకు నుంచి గ్రేటర్ వరంగల్కు, 25 ఎంఎల్డీ ట్యాంకు నుంచి వర్ధన్నపేట, జఫర్గడ్, పర్వతగిరి ప్రాంతాలకు తాగునీరు అందుతున్నది. కరీంనగర్ జిల్లా బొమ్మనపల్లి నుంచి ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి మండలాలకు నీటి సరఫరా జరుగుతున్నది.
దేవాదుల మూడో దశతో రిజర్వాయర్లకు జలకళ
రూ.1,167 కోట్లతో జయశంకర్ జిల్లాలో దేవాదుల మూడో దశ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. రూ.1,152కోట్లతో భీంఘన్పూర్ రిజర్వాయర్ వద్ద పంపుహౌస్, 22 మెగావాట్ల సామర్థ్యం గల మూడు విద్యుత్ మోటర్ల బిగింపు, భీంఘన్పూర్ పంపుహౌస్ నుంచి రామప్ప రిజర్వాయర్ వరకు 25.3 కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం పూర్తి చేసింది. మరో రూ.15 కోట్లతో రామప్ప రిజర్వాయర్ నుంచి గణపురం మండలం వంగపల్లి చెరువు వరకు 2.81 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ నిర్మించింది. ఇదే ఫీడర్ చానెల్లోని 2.15 కిలోమీటర్ల వద్ద నుంచి నేరుగా గణప సముద్రం రిజర్వాయర్ వరకు 3.365 కిలోమీటర్ల దూరం ఫీడర్ చానెల్ నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవలే మరో రూ.20 కోట్లు మంజూరు చేసింది. భీంఘన్పూర్ రిజర్వాయర్ నుంచి రామప్ప రిజర్వాయర్లోకి ఇప్పటి వరకు 4.7 టీఎంసీలు, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 2.609 టీఎంసీల నీటిని అధికారులు ఎత్తిపోయించారు. రామప్ప రిజర్వాయర్ నుంచి వంగపల్లి చెరువులోకి కొద్ది రోజుల క్రితం 500 ఎంసీఎఫ్టీ జలాలను ఎత్తిపోయించారు. దీంతో వంగపల్లి చెరువు మత్తడి పడి గణప సముద్రం రిజర్వాయర్లోకి జలాలు నేటికీ తరలివస్తున్నాయి
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లాలో రూ.353.89 కోట్లతో 4 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలో 21.6 ఎంఎల్డీ సామర్థ్యం, ఏటూరునాగారం మండలం రొయ్యూరులో 12 ఎంఎల్డీ సామర్థ్యం, మంగపేట మండలం కమలాపురంలో 10ఎంఎల్డీ సామర్థ్యం, వాజేడు మండలం పూసూరు వద్ద 9ఎంఎల్డీ సామర్థ్యం ట్యాంకులను నిర్మించారు. 10 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించే క్రమంలో పాలంపేటలో 2, దేవగిరిపట్నం, జాకారం, గుర్తూరుతండా, కంతనపల్లి, చిన్నబోయినపల్లి, తాడ్వాయి, మల్లూరు గుట్ట, దుద్దులమ్మ గట్టల వద్ద 1,460 క్యూసెక్కుల సామర్థ్యం గల రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. 18 సంపులు, 16 పుంపుహౌస్లను నిర్మించి 481 ఆవాసాలకు తాగు నీని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ శాఖ ద్వారా రూ.148.03 కోట్లతో 376 ఓహెచ్ఎస్ఆర్లను నిర్మించి 1195.536.09 కిలో మీటర్ల పైప్లైన్ నిర్మాణాన్ని చేపట్టి 87, 239 ఇండ్లకు స్వచ్ఛ జలాన్ని సరఫరా చేస్తున్నారు.
జయశంకర్ జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దేవాదుల మూడో దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం రూ.1167 కోట్లతో పూర్తి చేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా చేస్తున్నది. జిల్లాలో రూ.789 కోట్లతో మిషన్ భగీరథ పనులను పూర్తి చేసింది. మూడు నీటి శుద్ధీకరణ కేంద్రాలు, కొత్తగా 348 ఓహెచ్ఎస్ఆర్లు, 1519.79 కిలోమీటర్ల మేర నూతన పైపులైన్, 13 సంపులు, వీటితో పాటు 9 ఓహెచ్బీఆర్ (ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లు నిర్మించి 425 ఆవాసాలకు 1,05,263 నల్లాల ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నది. రూ.635 కోట్లతో భీంఘన్పూర్, గణప సముద్రం రిజర్వాయర్ల వద్ద ఇంటెక్వెల్లు, పంపుహౌస్లు, మహాముత్తారం మండలం కోనంపేట, భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం, గణపురం మండలం గాంధీనగర్ వద్ద నీటి శుద్ధీకరణ కేంద్రాలతో పాటు మెయిన్ పైపులైన్లు, సంపులు, ఓహెచ్బీఆర్ (ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లు నిర్మించారు. రూ.154 కోట్లతో ఇంట్రా కింద 348 ఓహెచ్ఎస్ఆర్ (ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్)లు, డిస్ట్రిబ్యూటింగ్ పైపులైన్లను నిర్మించి నల్లాలు ఏర్పాటు చేశారు.
తాగునీటి సమస్య పరిష్కారం
వర్ధన్నపేట : ఉమ్మడిపాలనలో ఎండాకాలంల తాగు నీటికి గోసపడేవాళ్లం. ఖాళీ బిందెలతో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. బోర్లు అడుగంటిపోయి నీటి సరఫరా జీపీలకు కష్టంగా ఉండేది. మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీళ్లు తెచ్చుకునేటోళ్లు. రైతుల బోర్లు, బావులను అద్దెకు తీసుకొని నీటిని సరఫరా చేసేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నది.
ములుగులో 490 ఆవాసాలకు సరఫరా
ములుగు జిల్లా వ్యాప్తంగా 4 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా 490 ఆవాసాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నాం. గోదావరి జలాలను వాటర్ ట్రిట్మెంట్ ప్లాంట్లకు పైప్లైన్ ద్వారా తరలించి శుద్ధి చేసి సరఫరా చేస్తున్నాం. రోజూ 52.6 మిలియన్ లీటర్ల నీటిని అందిస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు సైతం మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం.
– సీహెచ్ సుభాష్, మిషన్ భగీరథ ఇంట్రా డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ములుగు జిల్లా
ఇబ్బందులు లేకుండా చేశాం
దేవాదుల మూడో దశ కీలక సమయంలో ఉపయోగపడింది. భీంఘన్పూర్ రిజర్వాయర్ నుంచి రామప్ప రిజర్వాయర్లోకి 4.7 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోయించాము. ఈ జలాలతో రామప్ప, పాకాల చెరువుల కింద యాసంగి 25వేల ఎకరాలు సాగైంది. ఇది పోను 500 ఎంసీఎఫ్టీ నీటిని రామప్ప రిజర్వాయర్ నుంచి ఫీడర్ చానల్ ద్వారా వంగపల్లి చెరువులోకి, అక్కడి నుంచి మత్తడి ద్వారా గణప సముద్రం రిజర్వాయర్లోకి సరఫరా చేశాం. మిషన్ భగీరథ నీటిని కూడా ఈ రిజర్వాయర్ నుంచే సరఫరా చేస్తున్నాం. రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ముందస్తుగా రామప్ప నుంచి జలాలను గణప సముద్రానికి తరలించి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశాం.
– బిట్ల వెంకటేశ్వర్లు, ఈఈ, నీటి పారుదల శాఖ, జయశంకర్ భూపాలపల్లి
తాగు నీటికి ఇబ్బంది లేదు..
కావాల్సినంత నీటి వసతి ఉన్నది. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు. క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నాం. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, కరంట్ సరఫరా సమస్యలు వచ్చినప్పుడు మినహా నిరాటంకంగా తాగునీరు సరఫరా అవుతున్నది. ప్రభుత్వం నిత్యం ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నది.
– మల్లేశ్, మిషన్ భగీరథ ఎస్ఈ, హనుమకొండ
ఎంపీపీ అన్నమనేని అప్పారావు గోస తప్పింది..
నాడు ఎండకాలం వస్తే తాగు నీటి గోస ఉండేది. ట్యాంకర్లలో తెచ్చి ప్రజలకు నీటిని సరఫరా చేసేది. మహిళలు చేతిపంపుల వద్ద క్యూ కట్టి నీటిని పట్టుకునేందుకు ఇబ్బంది పడేటోళ్లు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతే రోజుల తరబడి నీటి సరఫరా నిలిచిపోయేది. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా రోజూ నీటి సరఫరా చేస్తుండడంతో ప్రజలు సంతోషంగా ఉంటున్నారు.
– ముత్యం దేవేంద్ర, సర్పంచ్, నల్లబెల్లి
రోజూ నీటి సరఫరా
ఇంతకుముందు నీటి కోసం అరిగోస పడేవాళ్లం. మిషన్ భగీరథ నీళ్లు ఇప్పుడు రోజూ వస్తున్నయ్. ఈ నీళ్లనే తాగుతున్నం. ఇంతకుముందు మంచినీళ్ల కోసం చానా ఇబ్బంది పడేది. సీఎం కేసీఆర్ సారు పేదల కోసం మంచి ఆలోచన చేసిండు. భగీరథ నీళ్లు ఇచ్చి మా ఆడబిడ్డల కష్టాలు తీర్చిండు.
– ఆరెందల అనసూయ, మహదేవపూర్