ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉంటూ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగుజిల్లాల్లో వరద ముంపునకు గురైన మోరంచపల్లి, కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తూనేపారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. రోడ్లను పునరుద్ధరించి రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారు.
– భూపాలపల్లి టౌన్/ఏటూరునాగారం, జూలై 31
మోరంచపల్లికి ప్రభుత్వం అండగా నిలిచింది. వరద వలయంలో చిక్కుకున్న నాటి నుంచి అధికార యంత్రాంగం అక్కడే ఉండి సేవలందిస్తున్నది. సోమవారం గ్రామంలో సహాయక చర్యలు యథావిధిగా కొనసాగాయి. గ్రామంలో తాగునీటి వ్యవస్థ మెరుగుపడింది. కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. రోడ్ల మరమ్మతులు పూర్తయ్యాయి. ప్రభుత్వం పంపిన సామగ్రిని గ్రామస్తులకు అధికారులు సోమవారం పంపిణీ చేశారు. ఇంటికి 25కిలోల బియ్యం, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బకెట్, మగ్గులను ఇంటింటికీ తిరుగుతూ అందించారు.
మరోవైపు జీఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్లు, నిత్యావసర వస్తువులను కడుపేదరికంలో ఉన్న చెంచులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అందజేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీపీవో ఆశాలత, డీఆర్డీవో పురుషోత్తం అక్కడే ఉండి సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. రెండు పునరావాస కేంద్రాలు సేవలందిస్తున్నాయి. చాలామంది ఇండ్లకు చేరుకోగా మిగిలిన అందరికీ భోజనం అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు సైతం గ్రామంలో సేవలందిస్తున్నాయి. జయశంకర్ ఫౌండేషన్ సభ్యులు ఐదో రోజు సైతం ఇంటింటికీ తిరుగుతూ మినరల్ వాటర్ సరఫరా చేశారు. కారల్మార్క్స్కాలనీకి చెందిన 30మంది మహిళలు స్వచ్ఛందంగా ఆయిల్ ప్యాకెట్లు తీసుకొచ్చి గ్రామస్తులకు అందించారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వైద్య సేవలు చేస్తున్నారు. పశు వైద్యాధికారులు, సిబ్బంది సైతం సేవలందిస్తున్నారు.
వీడని వరద భయం
కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాల ప్రజలను వరద భయం వీడలేదు. గ్రామాల్లో అనేక పెంకుటిల్లులు వరద తాకిడికి నాని పడిపోయాయి. సామగ్రి అంతా చిందరవందరగా ఉండడం, బురద పట్టుకుని ఉండడంతో ఇండ్లను శుభ్రం చేసుకుంటున్నారు. కొందరు ఇంకా తమ ఇండ్లకు చేరుకునే పరిస్థితి ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. కొండాయిలో సుమారు 20 మోటర్లు పనికిరాకుండా పోయాయి. అనేక వీధుల్లో చెత్తాచెదారం నిండింది. కొండాయిలో 163, మల్యాలలో 42, దొడ్లలో 19 ఇండ్లు దెబ్బతిన్నట్లు రెవెన్యూ అధికారుల సర్వేలో వెల్లడైంది. మూగ జీవాలు కొట్టుకపోయినట్లు బాధితులు తెలిపారు. కొందరివి మేకలు, పశువులు, గేదెలు కనిపించక అడవి బాట పట్టి వెతుక్కుంటున్నారు. పూర్తిగా గూడు కోల్పోయిన కొందరు చెట్లకిందకు సామాన్లను చేర్చుకున్నారు. బీరువాలు, కిరాణం సామాన్లు, ఫర్నిచర్, కూలర్లు, ఫ్రిజ్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తడిసిపోయినట్లు బాధితులు తెలిపారు. బ్యాంకు పుస్తకాలు, భూమి పట్టా పుస్తకాలు, ఇతర సర్టిఫికెట్లు ఆరబెట్టుకుంటున్నారు. గ్రామంలో పారిశుధ్య సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. సుమారు 50 ఎకరాల్లో ఇసుక మేటలు వేసి ఉంటాయని రైతులు తెలిపారు. జంపన్నవాగు నుంచి మల్యాల వరకు రోడ్డు వరదతో అధ్వాన్నంగా మారింది. ట్రాక్టర్ మాత్రమే వెళ్లడానికి అవకాశంగా ఉంది. నిత్యావసర వస్తువులన్నీ ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లోకి చేరవేస్తున్నారు.
అధికారులు, పోలీసుల సేవలు మరువలేనివి
వరదలతో మా గ్రామం తీవ్రంగా నష్టపోయింది. నలుగురు చనిపోవడం బాధాకరం. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా, అధికారు లు, పోలీసులు మాకు అండగా నిలిచారు. బోట్ల సాయంతో గ్రామస్తులను యుద్ధప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రెండు పాఠశాలల్లో వసతి కల్పించి భోజనాలను కూడా పడవల్లో తెప్పించి ఇచ్చారు. 24గంటల్లో కరెంటు బాగుచేసి, రోడ్లకు మరమ్మతులు, పారిశుధ్య పనులు చేశారు. నాలుగు రోజుల్లో గ్రామంలోకి ప్రజలు చేరుకునేలా చేశారు. అధికారులు, పోలీసులు కంటిమీద కునుకు లేకుండా పనిచేయడం మూలంగానే గ్రామం తేరుకుంది. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
– లకిడె కమలాభాయి, సర్పంచ్, మోరంచపల్లి
పశువులు కొట్టుకపోయినయ్
రెండు గ్రామాల్లో అనేక మంది పశువులు కొట్టుకపోయినయ్. వాటికోసం అడవికి వెళ్లి వెతుకుతున్నరు. ఇంటికి సుమారు 15కోళ్ల వరకు ఉంటాయి. వరదలో దాదాపు 500 కోళ్ల వరకు కొట్టుకుపోయి ఉంటాయి. కొందరి మేకలు కూడా కన్పించడం లేదు. ఎన్ని చనిపోయినయో లెక్కలేదు.
-మల్లెల రాంబాబు, మల్యాల
కోచింగ్ నుంచి వచ్చా
గురుకులాల పీజీటీ, టీజీటీ కోసం హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నా. పిల్లలు ఇక్కడే ఉండడంతో వారం క్రితం వచ్చా. మరుసటి రోజే వరద వచ్చింది. దీంతో ఇక్కడే ఆగిపోయా. ఇల్లంతా గుల్ల అయింది. ఒక్క వస్తువు కూడా దక్కలేదు. పాడైన ఇంటి సామగ్రి చెట్టు కింద పెట్టినం. స్టడీ సర్టిఫికెట్లు మాత్రం బీరువాలో పైన పెట్టుకుని కాపాడుకోగలిగా.
– కుర్సం సంధ్యారాణి, కొండాయి