స్టేషన్ఘన్పూర్, జూన్ 8 : పాదయాత్రలో భాగంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం పల్లగుట్ట గ్రామంలో నిర్వహించనున్న పర్యటనను అడ్డుకోవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన చిల్పూర్ మండలం లింగపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను నెరవేర్చకుండా ఏం మొఖం పెట్టుకొని భట్టి విక్రమార్క ఇక్కడి వస్తున్నాడో ప్రజలకు వివరించాలన్నారు. భట్టి పర్యటనను ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా వేశారని అన్నారు. కల్లాల్లో ధా న్యం, మక్కల కాంటాలు కాక రైతులు ఆవేశంగా ఉన్నారని, వారు ఎక్కడ తిరగబడతారోనని ఎమ్మె ల్యే కడియం శ్రీహరి పర్యటనను వాయిదా వేయించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 870 మంది రైతులు చనిపోయారని, వారిలో కొందరు యూరియా అందక చనిపోతే, మరికొందరు రైతు భరోసా చనిపోయారని అన్నారు.
రైతు రుణమాఫీపై ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రూ.40 వేల కోట్లు కాగా, రైతుల ఖాతాల్లో రూ.12వేల కోట్లు మాత్రమే వేశారన్నారు. సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పిన ఎగ్గొట్టారని, వానకాలం సీజన్కు సంబంధించి ప్రభుత్వం రూ.1159 కోట్లు బకాయి ఉందన్నారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదన్నారు. కనీసం రైతు భీమా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు, 189 సివిల్ కేసులు ఉన్నాయని, ఆయన భాషను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ముఖ్యనాయకుల, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.