నర్సంపేట, జనవరి 29 : నా ఓటమికి నేనే బాధ్యత వహిస్తానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని పద్మశాలీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పెద్ది మాట్లాడుతూ ఎవరి కోసం పార్టీ ఆగదన్నారు. కారు ఎక్కేవారు ఎక్కొచ్చు, దిగేవారు దిగొచ్చన్నారు. మూడు రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని సూచించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నామన్నారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కార్యాలయం 24 గంటలు తెరిచే ఉంటుందని వివరించారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నారని, పార్టీ నిలబెట్టిన ఎంపీ అభ్యర్థిని గ్రామ, బూత్ స్థాయి నుంచి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్సోళ్లు చిల్లర రాజకీయం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఇంత వరకు రెండెకరాలకు పైన ఉన్న రైతులకు రైతుబంధు, పాకాలకు గోదావరి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
ప్రతిపక్షం అంటే ఎలా ఉంటుందో మనమందరం కాంగ్రెస్కు చూపించాలన్నారు. గత ఆరు నెలల నుంచి నర్సంపేట అభివృద్ధికి తెచ్చిన జీవోను ఎమ్మెల్యే ఆపాలని చెప్పడంతో ప్రభుత్వం నిలిపి వేసిందన్నారు. పనులను ఆపాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. వచ్చిన నిధుల్లో ఏ ఒక్క రూపాయి ల్యాప్స్ అయినా ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ లోకసభ బీఆర్ఎస్ అభ్యర్థి టికెట్ తనదేనన్నారు. తానే పోటీ చేస్తున్నానని సభా వేదికగా ప్రకటించారు. కార్యకర్తలు సమష్టిగా బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి చెందడంపై నిరాశ చెందవద్దన్నారు. మళ్లీ గెలిచేది బీఆర్ఎసే అని కార్యకర్తలు గుర్తుంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.