పరకాల, ఏప్రిల్ 20 : బీఆర్ఎస్లో ఎంపీగా, డిప్యూటీ సీఎంగా, రెండు సార్లు ఎమ్మెల్సీ పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు నమ్మకద్రోహం చేసిన కడియం శ్రీహరి అభినవ కట్టప్ప అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. ఇవి నమ్మకానికి, నమ్మక ద్రోహానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని.. ఎంతోమంది రాజకీయ భవిష్యత్ను నాశనం చేసిన నయవంచకుడు కడియంకు బుద్ధిచెప్పేలా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం పరకాల శివారులోని లలిత కన్వెన్షన్ హాల్లో పరకాల నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించగా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నియోజకవర్గ సమన్వయకర్త, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, అభ్యర్థి సుధీర్కుమార్తో కలిసి పాల్గొన్నారు.
రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే : మాజీ మంత్రి ఎర్రబెల్లి
తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, సీఎం రేవంత్రెడ్డి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, ఆగస్టు 15న రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వాన్ని డిసాల్వ్ చేసి మళ్లీ ఎన్నికలకు వస్తావా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, కానీ సీఎం రేవంత్రెడ్డి హామీలను పక్కన పెట్టాడని, ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో భూముల ధరలు ఎంతో పెరిగాయని, రేవంత్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని కంపెనీలు తరలిపోవడంతో పాటు భూముల రేట్లు సగానికి పడిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ఓడగొట్టి తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కడియం బీఆర్ఎస్ను మోసం చేశాడని మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లింగంపల్లి కిషన్రావు, వాసుదేవారెడ్డి, శోభన్కుమార్ పాల్గొన్నారు.
దళితులను మోసం చేస్తున్న కడియం : మాజీ ఎమ్మెల్యే రాజయ్య
కడియం దళిత సమాజాన్ని మోసం చేస్తున్నాడు. దళిత దొరగా పేరు పొందిన కడియం ముందు తన కులంపై వివరణ ఇవ్వాలి. కుట్రలు, కుతంత్రాలకు మారుపేరుగా నిలిచిన కడియంకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు.
ఇద్దరు ఒక కోవకు చెందిన వారే : సుధీర్కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కడియం కావ్య, అరూరి రమేశ్ ఒకే కోవకుదిన వారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ఆలోచించి ఓటు వేయాలి. బీఆర్ఎస్ గెలిస్తేనే మోసపూరిత రాజకీయాలకు స్వస్తి.
మోసగాళ్లకు ఓటుతో సమాధానం చెప్పాలి :మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
మోసగాళ్లకు ఓటుతోనే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరూ బీఆర్ఎస్ను మోసం చేసిండ్లు. వీరిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఇంటింటా ప్రచారం చేయాలి. వరంగల్లో సుధీర్కుమార్ గెలుపును ఎవరూ ఆపలేదు.