స్వయంగా రైతు అయివుండి, ఎప్పుడూ రైతుల మేలు కోసమే పరితపించి, తన పదేళ్ల పాలనలో రైతును రాజుగా నిలబెట్టిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నీళ్లందక పంటలు ఎండిపోయి దిగులు చెందుతున్న రైతుల్లో ధైర్యం నింపేందుకు వస్తున్నారు. కరువుతో కన్నీరు పెడుతున్న రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో చూసి అన్నదాతలకు అభయమివ్వనున్నారు. పంటల పరిశీలనలో భాగంగా ఈ నెల 31న జనగామ జిల్లా దేవరుప్పులలో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడనున్నారు.
– జనగామ, మార్చి 29 (నమస్తే తెలంగాణ)
పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో నీళ్లందక ఎండిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకొని ఓదార్చనున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎర్రటి ఎండల్లోనూ నిండు కుండల్లా మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటల్లో ఇప్పుడు నీటి జాడలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. బోరు వేస్తే 80 ఫీట్ల లోతులోంచే ఉబికి వచ్చిన గంగమ్మ ఇప్పుడు 1.8 మీటర్ల లోతుకు పడిపోయింది. మొన్నటిదాకా పచ్చగా కళకళలాడిన పంటలకు సాగు నీరందక ఎండిపోయి నేలలు నెర్రెలు బారుతున్నాయి.
తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రాబోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. నీటి ఊటలు పాతాళంలోకి జారిపోతుంటే రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అదనులో మడులకు తడులందక నెర్రెలువారి పైరు వాలిపోయి పచ్చటి పంటలు కళ్ల ముందే ఎండుతుంటే రైతు గుండె అవిసిపోతున్నది. పూర్తిగా ఎండిపోతే ఎందుకూ పనికి రాదని చేసేదేం లేక పశువులు, జీవాలను మేతకు వదులుతున్న దుస్థితి కనిపిస్తున్నది. జనగామ జిల్లాలో ప్రస్తుత యాసంగిలో 2 లక్షల ఎకరాల్లో వరి వేయగా ఎనిమిదేళ్ల తర్వాత కరువు మళ్లీ తరుముకొస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి వరంగల్లో కరువుకు చిరునామాగా.. సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తయిన ప్రాంతంగా.. డార్క్ ఏరియాగా ముద్రపడి బోర్లువేసేందుకు, ఇసుక తీసేందుకు వీళ్లేని నిషేధాజ్ఞలకు గురై అతి దుర్భిక్షాన్ని ఎదుర్కొన్న జనగామ, తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఏర్పడిన తర్వాత దేవాదుల రూపంలో వచ్చిన గోదావరి నీటితో ఆకుపచ్చని చీరె కట్టుకుంది. నిన్నమొన్నటి దాకా దేవాదుల నీటితో సస్యశ్యామలంగా మారి, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వందరోజుల్లోనే కరువుకు చేరువైంది. కరెంటు, నీళ్ల కటకటతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. సాగు నీరందక చాలా ప్రాంతాల్లో ఎండిన పొలాలు దర్శనమిస్తున్నాయి. పంటలను పశువులకు వదిలేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుత యాసంగికి దేవాదుల ద్వారా సాగునీళ్లు వదలక భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ కాలేదు. బోర్లు కూడా వట్టిపోతున్నయ్.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జనగామ జిల్లాకు దేవాదుల నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో జిల్లాలోని 7 రిజర్వాయర్లకు గాను నర్మెట మండలం బొమ్మకూరు, లింగాలఘనపురం మండలం నవాబుపేట, స్టేషన్ఘన్పూర్ మండలం ఆర్ఎస్ ఘన్పూర్, రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. వర్షపాతం తక్కువగా ఉండే జనగామ ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు నుంచి ఆయా రిజర్వాయర్లకు గోదావరి నీటిని సరఫరా చేసి కాలువల ద్వారా చెరువులు, కుంటలు, ఇతర చిన్ననీటి వనరులు నింపడం వల్ల ఎండకాలంలోనూ నిండుగా మారి భూగర్భజలాలు సంమృద్ధిగా ఉండేవి. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 797 చెరువులు, కుంటలు ఉంటే వాటిలో 199 వనరుల్లో నీటి మట్టాలు 25 శాతానికి పడిపోయాయి.
మరో 62 నీటి వనరుల్లో 25 నుంచి 50శాతానికి, మరో 75 నీటి వనరుల్లో 50 నుంచి 100శాతం పడిపోయాయి. జిల్లాలో కేవలం 400 చెరువుల్లో మాత్రమే ప్రస్తుతం నీటి జాడలు కనిపిస్తున్నాయి. గతంలో 90 శాతానికి పైగా గ్రామాల్లో నీటి వనరులన్నీ దేవాదుల నీటితో నింపి పంటలకు సాగునీరందడం సహా భూగర్భ జల మట్టం పెరిగి బోర్లు వేసినా..బావులు తవ్వినా 80 నుంచి 100 ఫీట్ల లోపు నుంచే నీళ్లు ఉబికి వచ్చేవి. ప్రస్తుత ప్రభుత్వం యాసంగిలో దేవాదుల నీటిని విడుదల చేయక చెరువులు, కాలువలు ఎండిపోయి. బోరు బావులు వట్టిపోయి వరి, మక్క వంటి పంటలు ఎండుతున్నాయి. జనగామ జిల్లాలో కేవలం నెల వ్యవధిలోనే దారుణంగా 1.8 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయి కరువు ఛాయలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఎండుతున్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు కేసీఆర్ దేవరుప్పులకు వస్తున్నారు.