శంకర్గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తీసుకొచ్చారన్న విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉద యం బీఆర్ఎస్ నేతలు, ఉమ్మడి వ రంగల్ జిల్లా డిపోలకు చెందిన ఆర్టీసీ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించేందుకు బయలుదేరారు. ఈ క్ర మంలో పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. వరంగల్ కమిషనరేట్, జయశంకర్ భూపాలపల్లి, ము లుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన పోలీసులు ఎక్కడికక్కడ వా రిని నిర్బంధించారు. బీఆర్ఎస్ నేత లు బయటకు రాకుండా హౌస్అరెస్ట్ చేశారు.
రేవంత్ సర్కార్ నిరంకుశ త్వం.. పోలీసుల అత్యుత్సాహంతో ఉమ్మడి జిల్లా లో ఒక్కసారిగా ఎమర్జెన్సీ వాతావరణం నెలకొన్న ది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముత్తోజిపేటకు వెళ్లి ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ కార్మికుడికి నివాళులర్పించడంతోపాటు ఆ కుటుంబానికి భరోసా కల్పించడానికి బయలుదేరేలోపే పోలీసులు వారిని హనుమకొండ రాంనగర్లోని ఎర్రబెల్లి నివాసంలో రాత్రి వరకు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్ నుం చి వస్తున్న మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోత్ కవితను జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు.

వీరిని వదిలిపెట్టి, నర్సంపేటకు వెళ్లడానికి అనుమతించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. కేంద్రమంత్రి బండి సంజయ్ నర్సంపేటకు వెళ్లడానికి అనుమతి ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులకు ఎందుకు ఇవ్వరని ఎమ్మెల్యే పల్లా పోలీసు అధికారులను ప్రశ్నించారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ను చిన్నపెండ్యాల వద్ద అరెస్ట్ చేసి స్టేషన్ఘన్పూర్ పోలీస్స్టేషన్కు తరలించగా, వెంటనే విడుదల చేయాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
శంకర్గౌడ్ ఒక్క ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆత్మబలిదానం చేసుకోలేదని, సకల జనుల సమస్యలను చూసి చలించిపోయాడని, తన ఆత్మబలిదానంతోనైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు రావాలని ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాగా, భారీగా తరలివస్తున్న రాజకీయ పార్టీలు, ఆర్టీసీ సంఘాల నాయకులు, కార్మికులను అడ్డుకునేందుకు ముందస్తుగానే నర్సంపేట డిపో వద్ద, మృతుడి స్వగ్రామం ముత్త్తోజిపేటలో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయమే వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ముత్తోజిపేటకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. మొత్తానికి పెద్ద ఎత్తున మోహరించిన పోలీస్ బలగాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది.