వరంగల్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలు, వరదల అనంతరం సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వరంగల్ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో వైద్యులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మందులు అందజేసి, అవసరమైతే బాధితులను దవాఖానకు తరలిస్తున్నారు. హెల్త్ క్యాంపులు, అవగాహన సదస్సుల నిర్వహణతో పాటు దోమల నివారణకు ఫాగింగ్, పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించిన సిబ్బంది ఫీవర్ సర్వేను ముమ్మరం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె, బస్తీ దవాఖానలు, సబ్ సెంటర్లలోని వైద్యులు, ఏఎన్ఎంలు, ఎంఎల్ హెచ్పీలు, ఆశ వర్కర్లు సర్వేలో పాల్గొంటున్నారు. అలాగే పీహెచ్సీల్లో పాము, కుక్క కాటుకు మందులు అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్వో వెంకటరమణ వెల్లడించారు.
భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అధికారులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. పల్లెలు, పట్టణాల్లో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. అంటువ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సమీపంలోని దవాఖానకు తరలిస్తున్నారు. అవసరమైతే స్థానికంగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. బాధితులకు ట్రీట్మెంట్ చేసి మందులు అందజేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైన విషయం తెలిసిందే. అత్యంత భారీ వర్షాలతో వరదలు పల్లెలు, పట్టణాలను అతలాకుతలం చేశాయి. పలు గ్రామాలతో పాటు పట్టణాల్లో కొన్ని ఇండ్లలోకి వరద నీరు ప్రవేశించింది. ముఖ్యంగా వరంగల్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. ముంపునకు గురైన పల్లెలు, కాలనీలన్నీ తేరుకున్నాయి. వాటిలో సాధారణ పరిస్థితి నెలకొంది.
వరదల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా జిల్లావ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో డీఎంహెచ్వో వెంకటరమణ వైద్యాధికారులతో సమావేశమై ముందుజాగ్రత్త చర్యలపై సూచనలు చేశారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా జ్వర సర్వే మొదలైంది. పీహెచ్సీలు, పల్లె, బస్తీ దవాఖానలు, సబ్ సెంటర్లలోని వైద్యులు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశ వర్కర్లు సర్వేలో పాల్గొంటున్నారు.
గ్రామాలు, పట్టణంలోని ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. వాంతులు, విరేచనలు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స చేసి మందులు ఇస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని సమీపంలోని దవాఖానలకు పంపిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో ఎక్కువ మంది బాధ పడుతున్నట్లు తేలితే స్థానికంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి కండ్లకలక బాధితుల సంఖ్య పెరుగుతున్నందున వైద్య శిబిరాల్లో బాధితులకు యాంటీ బయాటిక్ డ్రాప్స్ ఇస్తున్నారు. వరద బాధితుల పునరావాస కేంద్రాల వద్ద కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వరంగల్లోని ఇరవై కేంద్రాల్లో ఈ శిబిరాలు కొనసాగుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
అంటు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..
వర్షాలు తగ్గినందున అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని దవాఖానకు చేరుకోవాలి. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. బోరు పంపు నీరు, ప్రభుత్వం సరఫరా చేసే సురక్షితమైన నీరు లేక కాచి చల్లార్చిన తర్వాత తాగాలి. తద్వార నీటి కలుషితమై ద్వారా వచ్చే వ్యాధుల నుంచి ముఖ్యంగా నీళ్ల విరోచనాలు, అతిసార వ్యాధి, వాంతులు తదితర వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఆహారం తినే ముందు, మల విసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమ తెరలు వాడాలి. పాము, కుక్క కాటు మందులు పీహెచ్సీల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి.
– కే వెంకటరమణ, డీఎంహెచ్వో, వరంగల్