హనుమకొండ, ఏప్రిల్ 9 : ఇటీవల జరిగిన అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో మకజొన్న రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు. జొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోకుండా, కొనుగోళ్లను నిర్లక్ష్యం చేస్తున్నదని, రైతులు గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పంట వేయగా, మహబూబాబాద్ జిల్లాలోనే 1.5 లక్షల ఎకరాల్లో సాగవుతున్నదని, ఇక్కడ 12 కేంద్రాలు ప్రారంభించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదని, కేవలం కేసముద్రం మార్కెట్లోనే మక్కలు కొంటున్నారన్నారు. ఈ జిల్లాలో ప్రైవేట్ వ్యాపారులు 95 వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తే ప్రభుత్వం కేవలం 191 క్వింటాళ్లు సేకరించిందన్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,400 ఉండగా ప్రైవేట్ వ్యాపారులు కేవలం రూ. 1,400 నుంచి రూ. 1,500 చెల్లిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులు ప్రైవేట్కు మొగ్గు చూపరన్నారు. అలాగే హనుమకొండ జిల్లాలో నాలుగు సెంటర్ల ద్వారా కొనుగోలు చేయగా, భూపాలపల్లిలో ఒక్క సెంటర్ కూడా ప్రారంభించలేదన్నారు.
వరంగల్ జిల్లాలో ఆరు కేంద్రాలు ప్రారంభిస్తే ఒక సెంటర్లోనే కొనుగోళ్లు ప్రారంభించారన్నారు. ములుగు, జనగామ జిల్లాల్లో ఒక్క క్వింటా కూడా మక్కలు కొనలేదన్నారు. పోర్టల్లో నమోదు చేస్తేనే మక్కలు కొనుగోలు చేస్తామని అంటున్నారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రభుత్వం పోత్సహించడం లేదన్నారు. పండిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సహిస్తున్న సర్కార్ రైతుల నడ్డి విరిస్తున్నదని మండిపడ్డారు.
మరో నెలలో వరి పంట చేతికొచ్చే సమయంలో కూడా ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్నారు. రైతులకు, ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిలదీస్తే అరెస్ట్లు, కేసులు పెడుతున్నారన్నారు. మేడిగడ్డ బరాజ్కు మరమ్మతు చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారన్నారు. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంతో మూడు జిల్లాల్లో తాగు, సాగు నీటి కొరత ఏర్పడుతున్నదన్నారు. కమీషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సరిపడా ప్రారంభించి రైతులను ఆదుకోవాలని తక్కళ్లపల్లి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉందని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఉద్యోగులు, కార్మికులు, ఆశ వరర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లయినా అమలు చేయలేదన్నారు. కేసీఆర్ హయాంలో అంగన్వాడీల జీతాలను రూ. 10,500కు పెంచారని గుర్తుచేశారు. అలాగే ఆశ వర్కర్ల వేతనాలు పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని నిలదీసిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్రంలో 300 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆర్టీసీ లాభాల్లో ఉందని చెబుతున్నప్పటికీ ఉద్యోగులకు జీతాలు, ఇతర బెనిఫిట్లు ఇవ్వడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సంఘాలు బంద్ నోటీసు ఇచ్చాయన్నారు. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపి ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా చేశారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ శాఖలోని 26 వేల మంది ఆర్టిజన్లను పర్మినెంట్ చేసి జీతాలు పెంచారని తెలిపారు. ప్రస్తుతం తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్పీడీసీఎల్ కార్యాలయాల ఎదుట ఉద్యోగులు సమ్మె చేస్తున్నారన్నారు. ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన గుండ్లసింగారం గ్రామానికి చెందిన ఆర్టిజన్ పున్నంచందర్ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందించడంతో పాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్, బీఆర్ఎస్ పోరాటంతో ఏర్పాటవుతున్న కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలివ్వాలని, కాజీపేటను డివిజన్గా ప్రకటించాలని, విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశ వరర్లు, ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని దాస్యం స్పష్టం చేశారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ సంకు నర్సింగరావు, పులి రజినీకాంత్, నయీముద్దీన్, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, ఉడతల సారంగపాణి, తాళ్లపల్లి జనార్ధన్గౌడ్, కోటేశ్వర్రావు, జానకి రాములు, వీపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.