Viral News : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ నగరం (Kanpur City) లో ఓ వస్త్ర దుకాణదారుడు తన కుమారుడి జన్మదినం సందర్భంగా ప్రకటించిన రూ.16 కే దుస్తుల ఆఫర్ ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయిన ఈ ప్రకటనను చూసి నాలుగు వేల మందికిపైగా జనం ఒక్కసారిగా దుకాణం వద్దకు పోటెత్తడంతో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి.
అన్వర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలమ్ మార్కెట్లో రయీస్ ఆలం అనే వ్యక్తి వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 15న తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. కేవలం 16 నిమిషాల వ్యవధిలో ఎవరైనా సరే కేవలం 16 రూపాయలకే సూట్లు, జీన్సులు, షర్టులు వంటి రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేయవచ్చని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ప్రకటన క్షణాల్లో వైరల్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది జనం దుకాణం ముందు బారులు తీరారు.
ఆఫర్ను దక్కించుకునేందుకు జనం ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పలువురు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో భయాందోళనకు గురైన దుకాణదారుడు రయీస్ ఆలం దుకాణానికి తాళంవేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న అన్వర్గంజ్, బేగమ్గంజ్ పోలీసులతో పాటు ఏసీపీ మంజయ్ సింగ్ భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
లాఠీలు పట్టుకుని లౌడ్స్పీకర్ల ద్వారా ప్రజలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దుకాణం వెలుపల దొరికిన యజమాని సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ జనసమూహాన్ని కూడగట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు దుకాణదారుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.