అదనపు కలెక్టర్ డేవిడ్
ఉగ్గంపల్లి, విస్సంపల్లి, దంతాలపల్లి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ
చిన్నగూడూరు: రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి, విస్సంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని రైతులతో మాట్లాడారు. తేమ, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలకు నష్టపోకుండా పట్టాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నర్సింగరాజు, జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ సయ్యద్ కుర్షీద్, తహసీల్దార్ రామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు ఉన్నారు.
రైతులకు సౌకర్యాలు కల్పించాలి
దంతాలపల్లి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీవో , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి
మరిపెడ : మండలంలోని చిల్లంచర్ల, వీరారం, తానంచర్ల, రాంపూరం తదితర గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ రాంప్రసాద్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రాల్లో పారదర్శకత పాటించాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని పల్లె పకృతివనం, నర్సరీలను పరిశీలించారు. పర్యావరణ సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం పథకంలో భాగంగా అధికారులు నర్సరీలు, నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గాదె అశోక్రెడ్డి, ఎంపీటీసీ కొమ్ము నరేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.