నెక్కొండ/తొర్రూరు, మే 11 : వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో అధికారులు మక్కల కాంటాలు నిలిపివేయడంతో ఆగ్రహించిన రైతులు నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో చేపట్టారు. అధికార యంత్రాంగం వచ్చి కాంటాలు ప్రారంభించేందాక కదిలేది లేదంటూ ట్రాఫిక్ను స్తంభింపజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రాస్తారోకో విరమించాలని, సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అలాగే తొర్రూరులో మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు తొర్రూరు వ్యవసాయ మారెట్ ఎదుట మహబూబాబాద్, తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి ధాన్యం బస్తాలతో ఆందోళన చేపట్టారు. ‘రావాలి..రావాలి..అత్తాకోడళ్లు..రావాలి’ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రైతులను బుజ్జగించి సమస్య సద్దుమణిగేలా చేశారు.