యాసంగిలో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. గతేడాది కొందరు ప్రయోగాత్మకంగా సాగు చేసి సక్సెస్ అవడంతో ఈ ఏడాది మరికొందరు ముందుకొస్తున్నారు. 24 గంటల కరంటు.. పుష్కలంగా నీళ్లు ఉండడం.. ధరల పెరుగుదల.. మక్కజొన్నతో ఆశించిన దిగుబడి రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా పత్తి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వరుస వానల కారణంగా పత్తి పంట దెబ్బతిని దిగుబడి తగ్గిపోయింది. మార్కెట్లో ధరలు మాత్రం పెరుగుతుండడంతో యాసంగిలో కూడా పత్తినే సాగు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు సాగు అనుకూలమని అధికారులు చెబుతుండగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో చేతికొచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చి, మార్కెట్లో క్వింటాలుకు రూ.10వేల ధర పలికినా గిట్టుబాటవుతుందని రైతులు భావిస్తున్నారు.
కేసముద్రం, నవంబర్ 14 : యాసంగిలో పత్తి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని గ్రామాల్లో అక్కడక్కడా రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. యాసంగిలో మక్కజొన్న సాగు చేసినపా వైరస్ సోకి దిగుబడి తగ్గి అన్నదాతలు నష్టపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా పత్తి పంట వేసేందుకు ముందుకొస్తున్నారు. రైతుబంధు ద్వారా ప్రభుత్వం ఎకరానికి రూ.10వేలు అందిస్తుండడం, వర్షాలు సమృద్దిగా కురిసి చెరువులు, బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉండడం.., 24 గంటల విద్యుత్ కరంటు సరఫరాతో యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా పత్తి సాగు చేస్తున్నారు.
రైతులు ఈ ఏడాది వానకాలంలో పత్తి, పెసర, మక్కజొన్న , బొబ్బర్ల వరి వంటి పంటలు సాగు చేశారు. అయితే వరుస వర్షాల కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గతేడాది జిల్లాలో 80వేల ఎకరాల్లో పత్తి సాగవగా, ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబ డి మాత్రమే వచ్చింది. దిగుబడి తగ్గడంతో 2022 మార్చి, ఏప్రిల్ నెలల్లో క్వింటాలుకు రూ.10వేలకు పైగా ధర పలికింది. కాగా, ఈ ఏడాది వానకాలంలో 91,983 ఎకరాల్లో పత్తి వేయగా, వరుసగా కురిసిన వర్షాలతో పూత, కాత రాలిపోయి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఎకరానికి సుమారు 5 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ధర పెరుగుతుందనే ఆశతో రైతులు యాసంగిలో ప్రయోగాత్మకంగా పత్తి సాగు చేస్తున్నారు. అంతేకాకుండా యాసంగిలో మక్కజొన్నకు కత్తెర పురుగు రావడం, కంకి పెడుతున్న సమయంలో వైరస్ సోకి మొక్క చనిపోయి దిగుబడి తగ్గి యి రైతులు నష్టపోతున్నారు. కందులు, పెసర, బొబ్బెర్లు, నువ్వులు వంటి పంటలు వేసినా దిగుబడి రాక నష్టపోవాల్సి వస్తున్నది. దీంతో రైతులు మక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పు డు సాగు చేసిన పత్తి మార్చి, ఏప్రిల్ నెలల్లో చేతికొచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చి, మార్కెట్లో క్వింటాలుకు రూ.10 వేల ధర పలికినా గిట్టుబాటవుతుందని రైతులు భావిస్తున్నారు.
10 మండలాల్లో..
దాదాపు పత్తి పంటను వానకాలంలోనే సాగు చేస్తారు. అయితే వరుస వర్షాల కారనంగా దిగుబడి పూర్తి తగ్గిపోతున్నది. ఈ క్రమంలో యాసంగిలో పత్తి సాగు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో కొంతమంది రైతులు అక్కడక్కడా సాగు చేస్తున్నారు. దీనికి తోడు వ్యవసాయ శాఖ సైతం యాసంగిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నది. ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం, మరిపెడ, కురవి, డోర్నకల్, గూడూరు, కొత్తగూడ, నర్సింహులపేట, గార్ల, నెల్లికుదురు మండలాల్లో 85 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కాగా, వ్యవసాయ శాఖ ప్రతిపాదనలకు సంబంధం లేకుండానే కొంతమంది రైతులు యాసంగిలో పత్తిని సాగు చేస్తున్నారు. ఒక్క కేసముద్రం మండలంలో సుమారు 40 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది.
పత్తి ధర రూ.9211
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాలు పత్తి ధర రూ. 9,211 పలికింది. 458 బస్తాల పత్తి మార్కెట్కు విక్రయానికి రాగా గరిష్ఠ ధర రూ.9211, కనిష్ఠ ధర 6,255 పలికింది. పత్తి ధర రోజు రోజుకూ స్వల్పంగా పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఇష్టం..
రైతులు తమ ఇష్టానుసారంగానే యాసంగిలో పత్తిసాగు చేస్తున్నారు. అధికారులు, శాస్త్రవేత్తలు పత్తి పంట సాగు చేయాలని చెప్పడం లేదు. ఆశించిన మేర దిగుబడి రాకున్నా పర్వాలేదు అనుకునే రైతులు పత్తి సాగు చేసుకోవచ్చు. ఈ నెల చివరి వరకు అనుకూలంగా ఉంటుంది. జిల్లాలోని 10 మండలాల్లో 85 ఎకరాల్లో యాసంగిలో సాగు చేయాలని ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.
– ఛత్రునాయక్, డీఏవో