నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి4 : ఒకప్పుడు పంట సాగు చేయాలంటే అప్పు ఎక్కడ తేవాలి. ఎవల దగ్గర చేయి చాపాలని రైతు ఆలోచించేటిది. నీళ్ల సౌలత్ లేక, అడపాదడపా వస్తున్న కరంట్తో శాన ఇబ్బందయ్యేది. రెండు పంటలకు నీళ్లందక జనవరి వచ్చిందంటే వాటి కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు కేసీఆర్ సర్కారు ఫుల్లు కరంటు, పుష్కలంగా నీళ్లు ఇవ్వడంతో పాటు అదునుకు పెట్టుబడి సాయం ఇస్తూ భరోసా ఇస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా రెండు సీజన్లలో ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సా యం అందిస్తుండడంతో ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 28 నుంచి ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియ మొదలుకాగా.. ఏడో రోజైన బుధవారం రైతులు బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్దకు వెళ్లి డబ్బులు అందుకొని సంబురపడ్డారు. ఇది వరకు ఖర్చుకు భయపడి భూములను పడావు పెట్టే వాళ్లమని.. ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు పైసలతో పంటలు వేస్తున్నామని చెబుతున్నారు.
రైతుల పరపతి పెంచిండు..
స్టేషన్ ఘన్పూర్ : నా పేరు ముక్కెర రాములు, మా నాన్న రామస్వామి. మాది స్టేషన్ ఘన్పూర్ మండలం కొత్తపల్లి. మేమిద్దరం వ్యవసాయం చేస్తాం. తెలంగాణ రాక ముందు కరువు వల్ల వ్యవసాయం ఉన్నా కూలి పనికి పోయేటోళ్లం. ఇంట్లో ఏదన్నా అవసరమైతే పైసా అప్పు పుట్టకపోయేది. కానీ కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినంక కరంటు ఫ్రీ ఇత్తాండు. పంట పెట్టుబడికి సాయం చేత్తాండు. సాగునీరు పుష్కలంగా ఇచ్చుట్ల మా పొలాలకు మస్తు డిమాండ్ అచ్చింది. ఇప్పుడు ఊళ్లె మాకు పరపతి పెరిగింది. ఇదంతా సారు వల్లే. తెలంగాణ వచ్చినంక రైతుల బతుకులు బాగుపడ్డయ్.
– ముక్కెర రాములు, రామస్వామి, కొత్తపల్లి
రైతుబంధుతో మస్తు మేలైతాంది..
పెద్దవంగర: కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంతో మాలాంటి రైతులకు శాన మేలైతాంది. గిటువంటి సర్కారును నా జీవితంల ఎప్పుడు సూడలె. నాకు 3ఎకరాల ఎవుసం భూమి ఉన్నది. అదునుకు రైతుబంధు సాయం అందుతుండడంతో బయట అప్పుల కోసం పోయే బాధ తప్పింది. ఆనందంగ ఎవుసం చేసుకుంటున్నం. రైతుల గురించి ఆలోచించే నాయకుడు ఈ దేశంల కేసీఆర్ ఒక్కడే.
– రంగు వినోద, రైతు, కొరిపెల్లి(పెద్దవంగర)
అప్పుల బాధ తప్పింది..
దుగ్గొండి: నాకు ఆరెకరాల పంట భూమి ఉన్నది. ఏటా పెట్టుబడికి అప్పు తీసుకొచ్చేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతుబంధు పథకంతో ఆ బాధ తప్పింది. సాలుకు రూ.60 వేలు వస్తున్నయ్. దీంతో సంబురంగ ఎవుసం చేసుకుంటున్న. జీవితమంతా కేసీఆర్కు రుణపడి ఉంటం.
– వంగాల మోహన్రెడ్డి, రైతు, రేఖంపల్లి(దుగ్గొండి)
నాటుకు ముందే పడ్డయ్..
దేవరుప్పుల: నాట్ల టైముకు బ్యాంకు అకౌంట్ల రైతుబంధు పైసల్ పడ్డయ్. కూలోళ్లకు డబ్బుల్లేక తిప్పలైతదని అనుకున్న. మంగళారమే సెల్ఫోన్ల టింగుటింగని మోగింది. మా పోరగాళ్లకు చూపిత్తే కేసీఆర్ సార్ నుంచి మెసేజ్ వచ్చింది. రూ.15 వేలు బ్యాంకుల పడ్డయట అన్నరు. పానం నిమ్మలమైంది. ఊళ్లెనే పైసలు తీసుకున్న. బుధవారం నాటు పెట్టిన. కేసీఆర్ పుణ్యాన మిత్తికి తెచ్చే బాధ తప్పింది. నాకు మూడెకరాల భూమి ఉంది. వాగు నీళ్లకే రెండు కార్లు పండుతున్నయ్. అదోరుకు నీళ్లకు తిప్పలై ఒక్కటే కారు నాటు పెట్టేది. కేసీఆర్తో నీళ్ల సౌలత్, పెట్టుబడి అచ్చింది. పండిన పంట మంచి పైకానికి కొంటుండ్రు. ఇన్ని పైసల్ ఎనుకేసుకునే రోజులొచ్చినయ్.
– జేరిపోతుల యాకయ్య, రైతు, కడవెండి(దేవరుప్పుల)
గతంల ఏ సర్కారూ ఇయ్యలె..
వాజేడు: గతంల ఏ సర్కారు ఇయ్యని పెట్టుబడి పైసలు కేసీఆర్ ఇత్తున్రు. పక్కనున్న రాష్ర్టాల్ల కూడ లేదు. నాకు 8 ఎకరా ల 89 సెంట్ల భూమి ఉంది. దానికి ఒక్క సీజన్ల రూ. 44,500, రెండు దఫాల్లో రూ. 89 వేలు రైతుబంధు సాయం అందుతాంది. నేను మిర్చి ఏసేందుకు, నారుమడి, ఇంక కొన్ని ఖర్చులకు ఈ డబ్బులు అక్కరకొత్తయ్. ఇలాంటి పథకం తెచ్చిన కేసీఆర్కు కృతజ్ఞతలు.
– కాకర్లపూడి వినోద్, రైతు, నాగారం(వాజేడు)
అప్పు కోసం అడిగే పనిలేదు..
గణపురం, జనవరి4: ఒకప్పుడు పంట ఏయాలంటే అప్పు ఎక్కడ పుడుతుందా? అని తిరిగేటోళ్లం. ఇప్పుడు ఎవల దగ్గర సేయిసాపడం లేదు. సర్కార్ నా ఖాతాల రైతుబంధు పైసలేసినట్లు నా ఫోన్కు మెస్సేజ్ వచ్చింది. నాకు సంబురమనిపించింది. యాసంగిల పొలం ఏత్తాన. ఈ పైసలను కొన్ని వరి నాటు పెట్టడానికి వచ్చిన కూలోళ్లకు ఇత్త. ఎరువులు తెత్త. కేసీఆర్ సార్ టైముకు పెట్టుబడి సాయం అందించిండు. ఆయన నిండు నూరేళ్లు సల్లంగ ఉండాలె.
– ముత్యాల రాజు, రైతు, గణపురం