జయశంకర్ భూపాలపల్లి, జూన్ 13(నమస్తే తెలంగాణ) : సమైక్యపాలనలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. తన భూమి తనకు తెలియకుండానే ఏ క్షణాన ఎవరి పేరిట మారిపోతుందో తెలియకపోయేది. బ్యాంకు రుణం తీసుకుందామనో, విత్తనాలు, ఎరువుల బస్తాలు తీసుకుందామనో, పహాణీ కోసం పట్వారి వద్దకు వెళ్తే, తన భూమి వేరొకరి పేరిట ఉందని చెప్పేవారు. నేను ఎవరికి భూమి అమ్మలేదు, నా భూమి వేరొకరి పేరు మీద ఎందుకు వచ్చిందని సదరు రైతు అడిగితే, అది మారిన సంవత్సరం నేను లేను, వేరొకరు ఉన్నారు, వారినే పోయి అడుగు అని దబాయించేవారు. పైఅధికారులు కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండకపోయేది. దీంతో ఏం చేయాలో బాధిత రైతన్నకు పాలుపోక కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేది. తన భూమే తన పేరిట రావాలంటే దళారులను, పైరవీకారులను ఆశ్రయించక తప్పకపోయేది. ఇలా సమైక్య రాష్ట్రంలో రైతన్నలు అరిగోసపడ్డారు. అన్నదాతలు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇలా చెప్పుకుంటూపోతే ఒడిసేవి కావు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ అక్రమాలకు శాశ్వత పరిష్కారం చూపించి రైతన్నల భూములకు భద్రత కల్పించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్కు శ్రీకారం చుట్టారు. ఫలితంగా సమైక్య పాలనలో ఇష్టారాజ్యంగా కొనసాగిన అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే గాక రైతులకు పట్టా మార్పిడి వెనువెంటనే అయ్యేలా చేశారు. అప్పటినుంచి ధరణి ఎంతో మేలు చేస్తుందని, రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్ని వర్గాల ప్రజలు సంబురపడుతున్నారు. కంటినిండా నిద్రపోతున్నారు. ధరణితో సత్వర పట్టా మార్పిడి, తమ భూములకు భద్రత ఉంటుండడంపై రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ధరణితో త్వరగా పట్టా మార్పిడి
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : అంతకుముందు పట్టా మార్పిడి కావాలంటే పట్వారి, గిర్దావరి, ఎమ్మార్వో చుట్టూ తిరిగేటోళ్లం. పైరవీకారులు, దళారుల దందా ఇగ చెప్పనవసరం లేదు. ఇదంతా నాటి పరిస్థితి. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సారు ధరణి తీసుకురావడం వల్ల భూముల పట్టా మార్పిడి తొందరగా అయింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజే పట్టా మార్పిడి బదలాయింపు జరిగిపోతాంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుబంధు డబ్బులు పడుతున్నయ్. ధరణిని తీసేయాలని కొందరు అర్థం పర్థం లేకుండా మొత్తుకుంటున్నారు. రైతుల భూములకు భద్రంగా ఉంటున్నది ధరణిని తీసేయాల్నా..? మునుపటి లెక్క అక్రమంగా భూముల మార్పు జరిగి చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డ విషయం వారికి తెలియదా? ఇప్పుడు ధరణితో ఆ బాధంతా తప్పింది. దర్జాగా మా భూములు మాకే ఉంటాయనే భరోసా ఇచ్చిండు కేసీఆర్ సారు.
– అనుము రవి, రామన్నగూడెం, రైతుబంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్, రేగొండ మండలం
ధరణి లేకుంటే పేద రైతు బతికేవాడా?
మహబూబాబాద్, జూన్ 13 (నమస్తే తెలం గాణ) : సీఎం కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఎంతో ఉపయో గకరంగా ఉంది. గతం లో ఉన్న భూ మార్పిడి వ్యవస్థలో జరిగే అవక తవకలను రూపుమాపి ప్రతి రైతుకు భరోసా క ల్పించింది. ఇదివరకు పట్టా మార్పిడి కోసం సంవత్సరాల తరబడి కార్యాల యాల చుట్టూ తిరిగినా పని కాకపోయేది. డబ్బులు ఇవ్వనిదే పాస్బుక్ చేసేవారు కాదు. ధరణి లేకపోతే పేద రైతు బతికేవాడా.. రాష్ట్రం వచ్చిన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు పాత పద్ధతి కొనసాగితే పేద రైతుకు భూమి ఉండేది కాదు. ధరణి వల్ల ప్రతి రైతు తన వేలిముద్రతో భూమిని కాపాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ధరణి లేనప్పుడు ఒకే సర్వేనంబర్ మీద ఇద్దరికి, ముగ్గురికి పట్టాలు చేసేవారు. ధరణి ద్వారా ఒకరి భూములను మరొకరు ఆక్రమించే అవకాశం లేదు. పోర్టల్ ప్రవేశపెట్టినప్పటి నుంచి భూములను కొన్నా, విక్రయించినా మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకొంటే ఆ తేదీన నేరుగా తహసీల్కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకొంటున్నారు. సాఫీగా పని సాగుతోంది. ఇంత మేలు చేస్తున్న ధరణిని అధికారంతోకి వచ్చాక రద్దు చేస్తామని ప్రతిపక్షాలు అనడం దుర్మార్గం. ధరణి వల్లే రైతులు గుండెమీద చేయివేసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ధరణి లేకుంటే మళ్లీ ఆగమాగం అవుతారు.
– నల్లాని నవీన్రావు, సర్పంచ్, మునిగలవీడు, నెల్లికుదురు మండలం
అలుకగ పనులైతానయ్..
చిట్యాల, జూన్ 13 : భూమి జాగ అమ్మకాలు కొనుగోలు పనులు అలుకగా అయితానయ్. కళ ్లముందు కాసేపు నిలబడితే చాలు చకచక పనులు అయి ఒకరికొరికి లడాయి, పంచాయతీలు లేకుంగా సులువుగా భూమి అమ్మకాలు, కొనుగోలు ధరణిలో జరుగుతున్నాయి. నా అవసరాల నిమిత్తం నాకున్న భూమిలో 20గుంటలు అమ్మిన. ఇదివరకు తెల్లకాగితాల మీద పెద్ద మనుషుల ఒప్పందంతో అమ్మకాలు జరుపుతుండే వారు. అప్పుడు పెద్ద మనుషులు ఏది నిర్ణయం చేస్తే అదే జరిగేది. పంచాయితీలు పుట్టించి ఇరువర్గాల దగ్గర పైసలు వసూల్ చేసుకుని పబ్బం గడిపేవారు. అటు పంచాయితీ తెగక, ఇటు భూమి అమ్మకం, కొనుగోలు జరగక ఎక్కడి భూములు అక్కడే బీడుపడేవి. కోర్టుకు పోదామంటే ఆ కాలంలో జాగ కాగితాలు సక్కగ ఉండకపోయేటివి. కానీ ఇప్పుడు నయాపైసా ఖర్చు లేకుండా తొందరగా రిజిస్ట్రేషన్ అయితాంది. ఠక్కున అప్పడిదప్పుడే తహసీల్దార్ భూమి పత్రాలను ఇస్తున్నరు. ధరణితోటి ఇంతమంచి సౌలత్ చేసిన సీఎం కేసీఆర్ సార్కు దండాలు.
– రాదండి లక్ష్మి, జూకల్, చిట్యాల, జయశంకర్ జిల్లా
ధరణితో ఎత్తేస్తే పాతకథే అయితది..
నర్సంపేట, జూన్ 13 : ధరణి పోర్టల్తో ఎంతో మేలు అయితాంది. రైతుల భూముల సమస్యలు తీర్చిన ధరణిని తీసేయాలంటున్నరట కొందరు నాయకులు. ఒకవేళ ఎత్తేస్తే మళ్ల పాత కథే అయితది. మునుపటి లెక్క రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్లీ పట్వారీ వ్యవస్థ వస్తుంది. పహణీలను, భూ రికార్డులను మార్చేందుకు వీలు ఉండదు. ధరణి పోర్టల్ను ఎత్తేస్తామనడం సరికాదు. ధరణితో ఎంతోమంది లబ్ధిపొందారు. సకాలంలో పనులు అవుతున్నయ్. భూముల రిజిస్ట్రేషన్ పనులు కూడా 10నిమిషాల్లో అయితున్నయ్. ధరణితో వీలైనంత తొందరగా పట్టా పాసుపుస్తకాలు కూడా చేతికి అందుతున్నయ్. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతున్నది. ధరణిని ఇలాగే కొనసాగిస్తే ఉపయోగం ఉంటుంది. ధరణిని తీసెస్తే మళ్లీ పైరవీకారులు పుట్టుకొని వస్తారు. ధరణిని తీసేయొద్దు.
– కుండెమల్లయ్య, చెన్నారావుపేట
ధరణి సేవలు రైతులకు వరం
మహదేవపూర్, జూన్ 13 : నాకు ఊరిలో ఐదెకరాల భూమి ఉన్నది. మిర్చి సాగు చేత్తా. నా భూమికి కొత్త పాస్బుక్ కూడా అచ్చింది. రైతు బంధు కూడా టైంకు పడ్తాంది. పెట్టుబడి ఇబ్బంది తప్పింది. ఇదివరకు సాగుకు భూమి మీద బ్యాంక్ లోను తీసుకోవడానికి బ్యాంకోళ్లు పహాణీలు అడిగేది. దాని కోసం ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరుగుడు అయ్యేది. అధికారులు పట్టించుకోకపోయేది. శానా కష్టం అయ్యేది. గిప్పుడు ధరణి వచ్చినంక ఆ ఇబ్బంది తప్పింది. కొత్త పట్టా పాస్బుక్తో బ్యాంక్ లోను తీసుకుంటాన. భూమి ఆన్లైన్లో ఎక్కడం వల్ల సమస్యలు తీరినయ్. ఇదివరకు భూమి కాగితాలల్ల ఉండేది. అధికారులు, బ్రోకర్లు మాయచేసి రికార్డులు తారుమారు చేసేటోళ్లు. ధరణితో భూమి అమ్ముడు, కొనుడు తొందరగా అయితాంది. మొన్న నేను ఊరిలో అర ఎకరం కొన్న. మీసేవలో నాపేరుపై స్లాట్ బుక్ చేసుకున్న.ఎమ్మార్వో ఆఫీస్లో తొందరగా రిజిస్ట్రేషన్ అయింది. ధరణి వచ్చినంక నాకు చాలా సంతోషంగా ఉంది. దళారుల బెడద తప్పింది. నా భూమి రికార్డుల్లో భద్రంగా ఉంది. ధీమాగా ఉంటాన . తెలంగాణ సర్కార్కు, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంట.
– సుంకె కృష్ణమూర్తి, మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
రైతులకు ఇబ్బందుల్లేకుండా..
నర్సింహులపేట, జూన్ 13 : ధరణితో భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాతే అందరిలో నూ ధైర్యం వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రి జిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా త హసీల్దార్కు అధికారం బదలాయించడం మంచి పరిణా మం. తహసీల్లోనే రిజిస్ట్రేషన్తో పాటు వెంటనే సంబం ధిత మార్పిడి ఉత్తర్వులు యజమానికి అందజేస్తున్నారు. నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకం వస్తున్నాయి. భూ తగాదాల శాశ్వత పరిషారానికి ధరణి పోర్టల్ మంచి అవకాశంగా నిలిచింది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అయినా దేశంలో భూతగాదాలు పరిషారం కావడం లేదు. పోలీస్స్టేషన్ కేసుల్లో సగానికి పైగా భూతగాదాలవే. వివాదాల వల్ల సమయాన్ని, ఆదాయాన్ని, మనశ్శాంతిని రైతులు కోల్పోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ధరణికి శ్రీకారం చుట్టారు. ఇవాళ ధరణితో ఎంతో ప్రయోజనం కలుగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం భూముల విషయాల్లో తలదూర్చే అవకాశం లేనంత పారదర్శకంగా పోర్టల్ ఉంది. రికార్డులను వ్యక్తుల చేతుల్లో నుంచి ధరణి వ్యవస్థలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో అసలైన రైతులకు న్యాయం జరుగుతుంది.
– యల్లు మధుసూదన్రెడ్డి, వంతడపల సర్పంచ్
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ సర్కారు తెచ్చిన ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఇంతకుముందు రైతుకు తెలియకుండానే తన పేర ఉన్న భూమిని అధికారులను మచ్చిక చేసుకొని ఇంకొకరి పేరిట చేసుకునేవారు. ఇప్పుడు రైతుకు తెలియకుండా పట్టా మారే ప్రసక్తే లేదు. గతంలో అమ్మినవారు, కొన్నవారు, లేదా తండ్రి పేర ఉన్న భూమి కొడుకుల పేర కావాలన్నా రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి ఎంతోకొంత ముట్టజెబితే కానీ పని కాకపోయేది. నాటి అవకతవకలు, అవినీతి వంటి వాటికి ధరణితో చెక్ పెట్టింది. ఏ రైతు అయినా తన అవసరం కోసం భూమి అమ్ముకుంటే ముందుగా భయానా కొంత మొత్తం ఇచ్చి కాగితం రాయించుకునే వారు. కొన్న అతని పేర పట్టా అయితేనే మొత్తం ఇచ్చేవారు. ఇద్దరూ కలిసి కొన్న అతని పేరిట భూమి చేయాలని అధికారులు, సిబ్బంది చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయేవారు. ఎంతకూ పట్టా మార్పిడి కాక, అమ్మిన వ్యక్తికి అవసరానికి డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గంటలోనే రిజిస్ట్రేషన్ పూర్తయి పట్టా మార్పిడి అవుతుంది. అవసరం ఉండి భూమి అమ్ముకున్న అతనికి వెంటనే డబ్బులు చేతికి అందుతున్నాయి. రైతులకు ఫైరవీకారుల బాధ తప్పింది.
– కామిడి రత్నాకర్రెడ్డి, సర్పంచ్, జడల్పేట, చిట్యాల మండలం