నమస్తే నెట్వర్క్, జూలై 18: వ్యవసాయానికి మూడు గంటలు కరెంటిస్తే చాలని కాంగ్రెస్ అంటోందని, ఆ పార్టీ వద్దు.. మళ్లీ పాత రోజులొద్దని రైతులు స్పష్టం చేశారు. రైతులకు 24గంటల కరెంట్ వద్దని, మూడు గంటలు సరిపో తుందన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీకట్ల కాలం వద్దు.. 24 గంటలపాటు కరెంటిస్తున్న కేసీఆర్పాలనే ముద్దు అంటూ నినదించారు. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమావేశాలు నిర్వహించారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ క్రాప్, పవర్ హాలీడేలు ప్రకటించిన చరిత్ర కాంగ్రెస్దని అన్నారు. అలాంటి పార్టీ వైఖరిని గ్రామాల్లో వివరించి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరారు. జనగామ మండలంలోని ఓబుల్ కేశ్వాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు సుమారు 500 మంది రైతులు పాల్గొని దొంగ నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు.
జఫర్గఢ్ మండలం కూనూరులో ‘కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంట్ వద్దు, సీఎం కేసీఆర్ ఇచ్చే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ కొనసాగించాలి’ అని ఎమ్మెల్యే రాజయ్య రైతులతో తీర్మానం చేయించి ఆమోదించారు. మహబూబాబాద్ మండలం మల్యాల, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలం తారాసింగ్బావి తండాలో నిర్వహించిన కార్య క్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ పాల్గొని 3 గంటల కరెంట్ కావాలా.. 3 పంటలు కావాలో రైతులే తేల్చుకోవాలన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజమే సిగ్గుపడేలా మాట్లాడుతున్న రేవంత్రెడ్డిని తక్షణమే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ మూడు గంటల కరెంటుపై గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్లో రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
రైతులను గోసపెడితే పుట్టగతులుండవ్..
మట్టిని నమ్ముకొని బతికే రైతుల బాధలను ఏనాడూ పట్టించుకోని రేవంత్రెడ్డికి ఎవుసం గురించి ఏం తెలుస్తది? ఎన్నో ప్రభుత్వాలు అచ్చినయ్, పోయినయ్. ఏనాడూ రైతుల గురించి ఆలోచన జేసిన నాయకుడు లేడు. ఏటైంకు అత్తదో, ఏటైంకు పోతదో తెలువని కరంట్ గురించి నాడు కండ్లళ్ల వత్తులేసుకొని ఎదురు సూసెటోళ్లం. పెండ్లాం పిల్లలను ఇడిసిపెట్టి రాత్రిపూట మోటర్ల కాడికి పోయి పొలాలు పారిచ్చుకునెటోళ్లం. అచ్చీరాని కరంట్తోని మోటర్లు కాలిపోతే అప్పుల పాలైనం. అర్ధరాత్రి, అపరాత్రి అనక పొలంకాడికి పోతే పాములు కుట్టి, కరంట్ షాక్గొట్టి ఎంతో మంది సచ్చిపోయిన్రు. తెలంగాణ అచ్చినంక సీఎం కేసీఆర్ సార్ రైతుల గోస జూసి 24గంటల ఉచిత కరంట్ ఇస్తాండు. ఇప్పుడు రాత్రిళ్లు పొలంకాడికి పోవుడు లేదు, మోటర్లు కాలుడు లేదు. 24గంటల కరంట్తోని రైతులమంతా సంబురంగా ఉంటే ఓర్వలేని రేవంత్రెడ్డి మూడు గంటలు సాలు అని మాట్లాడుతున్నడు. రైతులను గోసపెడితే పుట్టగతులుండవ్..
-కొమ్మురవి, రైతు, జూకల్ (చిట్యాల)
రేవంత్.. ఒళ్లు దగ్గరపెట్టుకో
నెల్లికుదురు, జూలై 18 : అయ్యా రేవంత్రెడ్డీ.. ఎవుసాన్ని ఎప్పుడన్న చూసినవా? మూడు గంటల కరెంటు సరిపోతదా? ఎట్ల సరిపోతది చెప్పు.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు రేవంత్రెడ్డీ.. నాడు పెండ్లాం పిల్లలను వదిలి రాత్రుళ్లు టార్చిలైట్లు పట్టుకొని నీళ్లు పెట్టేందుకు పోయేది. కరెంటు కోసం పొలం గట్ల మీద రాత్రింబవళ్లు పడిగాపులు కాసినం. మళ్ల అట్లాంటి తిప్పలు మాకొద్దయ్యా.. సీఎం కేసీఆర్ పుణ్యమాని ఇప్పుడా బాధలు లేవు. కరంటు కష్టాలు లేవు. ఎప్పుడంటె అప్పుడు పొలాలకు నీళ్లు పారిస్తాన్నం. మోటర్ల మరమ్మతులు లేకుండవోయినయ్. సీఎం సారు పెట్టుపడి సాయంజేత్తాండు. ఇప్పుడు దర్జాగ బతుకుతున్నం. ఈ కాంగ్రెసొద్దు.. మునుపటి కష్టాలు మాకొద్దు.
– ధరంసోత్ భీమానాయక్, రైతు, జామతండా(నెల్లికుదురు)
రైతులే గుణపాఠం చెబుతారు
ఉచిత కరెంట్పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రైతులే గుణపాఠం చెబుతారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే రైతుల కళ్లలో ఆనందం అగుపిస్తున్నది. సమైక్య పాలనలో కరెంట్ కోసం రైతులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాత్రిపూట మోటర్లు పెట్టేందుకు రైతులు పడిన బాధలు రేవంత్రెడ్డికి తెలియవా..? పదేండ్ల నుంచి మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ నాయకులు ఇకనైనా రేవంత్రెడ్డి మాటలు నమ్మకుండా కళ్లు తెరవాలి. అప్పుడే రైతులు గ్రామాల్లోకి కాంగ్రెస్ వాళ్లను రానిస్తరు. లేకపోతే అన్నదాతల చేతుల్లో పరాభవం తప్పదు.
-నెల్లుట్ల రేవతి, మహిళా రైతు
రైతులకు క్షమాపణ చెప్పాలి
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రాజకీయ పబ్బం కోసమే చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులు ఆయనకు అగుపడత లేవా..? 24 గంటల ఉచిత కరెంట్ లేనిదే రాష్ట్రంలో ఇన్నేసి క్విం టాళ్ల ధాన్యం పండుతున్నదా..? రేవంత్రెడ్డి.. నీ మాటలతో రైతులకు అన్యాయం చేయాలని చూస్తే మిమ్ములను క్షమించరు. అన్నదాతల సంక్షేమంగా, ఆత్మగౌరవంతో బతకడం రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేనట్లుగా అనిపిస్తున్నది. ఇప్పటికైనా రైతులందరికీ క్షమాపణ చెప్పి, రైతు వ్యతిరేక పోకడలను ఆపకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు.
-అనుమాండ్ల రాజయ్య, రైతు
సీఎం కేసీఆర్తోనే ఎవుసానికి కొత్త ఊపు
ఖానాపురం, జూలై 18: సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలతోనే వ్యవసాయానికి కొత్త ఊపు వచ్చింది. గత ప్రభుత్వాలు రైతులను ఏ మాత్రం పట్టించుకోలేదు. నాడు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది. ఊళ్లలో బతుకు దెరువు లేక పట్టణాలకు వలసలు పోయినం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక నీళ్లు, కరెంటు పుష్కలంగా ఇస్తున్నది. రైతుబంధు ఇస్తున్నది. సకాలంల ఎరువులు ఇస్తున్నది. ఇప్పుడు ఎవుసం లాభసాటిగా మారింది. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నది. రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతుంటే ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు రైతులను మళ్లీ ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నరు. ఇది వాళ్లకు మంచిది కాదు. రైతులను కంటికిరెప్పలా కాపాడుకుంటున్న కేసీఆర్ వెంటే మేమంతా ఉంటం.
-వినోద్, రైతు, చిలుకమ్మనగర్ (ఖానాపురం)
రేవంత్రెడ్డికి ఎవుసంపై అవగాహనే లేదు
ఖానాపురం,జూలై 18: గంటకు ఎకరం.. మూడు గంటలకు మూడు ఎకరాలను పారించొచ్చు అని మాట్లాడిన రేవంత్రెడ్డికి ఎవుసంపై కనీస అవగాహన లేదు. తెలంగాణ సర్కారు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ రైతులను కాపాడుకుంటుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలే ఇస్తామంటున్నారు. ఇదేనా కాంగ్రెస్ నాయకులకు రైతులపై ఉన్న చిత్తశుద్ధి? ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు రైతులు మద్దతివ్వరు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రైతులకు క్షమాపణ చెప్పాలి. 24గంటల కరెంటును సమర్థించాలి. లేదంటే కాంగ్రెస్ నాయకులను ఊళ్లలోకి రానివ్వం.
-బండి వెంకన్న, రైతు, అశోక్నగర్ (ఖానాపురం)