ఖిలావరంగల్, మార్చి 16: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు ప్రజల కళ్లల్లో కాంతులు నింపుతున్నాయి. ఇప్పటి వరకు లక్షలాది మందికి నేత్ర పరీక్షలు చేసి అవసరం అయిన వారికి మందులు, కళ్లద్దాలు అందించారు. జిల్లాలో గురువారం వరకు 2,58,249 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ కే వెంకటరమణ వెల్లడించారు. 131 గ్రామ పంచాయతీలు, 39 వార్డుల్లో నేత్ర పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. అలాగే, 26 జీపీలు, 18 మున్సిపాలిటీ వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నట్లు వివరించారు. 1,21,510 మంది పురుషులు, 1,36,430 మంది మహిళలు, 293 మంది హిజ్రాలు కంటి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. 1,93,906 మందికి సమస్యలు లేవన్నారు. 39,227 మందికి రీడింగ్ గ్లాసులు అందించామని, 25,116 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ చేసినట్లు డీఎంహెచ్వో స్పష్టం చేశారు.
పోచమ్మమైదాన్: తెలంగాణలో అంధత్వ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను ప్రజలు వినియోగించుకునేలా చూడాలని అధికారులు, నాయకులకు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచించారు. వరంగల్ 13వ డివిజన్ ప్రజల కోసం వరంగల్ దేశాయిపేట కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు, కళ్లద్దాల పంపిణీపై ఆరా తీశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు కావటి కవిత, సురేశ్కుమార్ జోషి, డివిజన్ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం 12వ డివిజన్లో బీఆర్ఎస్ యూత్ నాయకుడు రాంకీ యాదవ్ ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
వరంగల్చౌరస్తా: కంటి వెలుగు కార్యక్రమం వరంగల్ 36వ డివిజన్లో కాంతులను నింపింది. చింతల్ కమ్యూనిటీ హాల్లో జనవరి 19న కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ శిబిరాన్ని ప్రారంభించగా, స్థానికుల కంటి సమస్యలను పరిష్కరించింది. డివిజన్ పరిధిలో 40 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శిబిరాన్ని 38వ డివిజన్ పరిధిలోకి మార్చుతున్నట్లు వైద్యాధికారి జ్యోత్స్న తెలిపారు. ఈ శిబిరంలో 1868 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించామని, 660 మందిలో దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించి కళ్లద్దాలు అందించినట్లు తెలిపారు. 370 మందికి ప్రత్యేక అద్దాల కోసం ఆర్డర్ చేశామన్నారు. వాటిలో 103 మందికి అద్దాలు అందించినట్లు వెల్లడించారు. త్వరలోనే మిగతా 267 మందికి కళ్లద్దాలు అందిస్తామన్నారు.
నర్సంపేటరూరల్/పర్వతగిరి: కంటివెలుగు శిబిరాలు నర్సంపేట మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గురువారం దాసరిపల్లి, ఇప్పల్తండాలో ప్రజలకు నేత్ర పరీక్షలు చేశారు. అనంతరం అవసరమున్న వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిబిరాలను సర్పంచ్లు పెండ్యాల శ్రీనివాస్, భూక్యా సుజాత పరిశీలించారు. కార్యక్రమాల్లో వైద్యాధికారులు కల్యాణి, సరోజ, కార్యదర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పర్వతగిరి మండలం బూరుగుమళ్ల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ ఏడుదొడ్ల ఇందిరా జితేందర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పంతులు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, నాయకులు ఎలికట్ట వేణు, జనార్దన్రెడ్డి, చింతల శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, రాజశేఖర్, దామోదర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.