ఉద్యమ స్ఫూర్తితో ముఖ్యమంతి కేసీఆర్ ప్రభుత్వ బడులకు కొత్త జవసత్వాలు తెచ్చేందుకు ‘మన ఊరు-మన బడి’ని అమలు చేయాలని నిర్ణయించారు. సర్కారు స్కూళ్లు సరస్వతి నిలయాలుగా మార్చే సంకల్పంతో ఇప్పటికే వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను సమర్థవంతంగా నడిపిస్తూ బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపుతున్నారు. కూలీనాలి చేసుకుని వెల్లదీస్తున్న అనేక కుటుంబాలకు చెందిన నిరుపేద బిడ్డలకు కార్పొరేట్ విద్యావ్యవస్థను తలదన్నే రీతిలో సకల సౌకర్యాలు, నాణ్యతతో కూడిన విద్యాబోధనను అందిస్తున్నారు. ఇప్పుడు ఊరి బడులను కాపాడే సంకల్పంతో అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టడంపై ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. – తొర్రూరు, జనవరి 25
ప్రణాళికలు అవసరం..
‘మన ఊరు-మన బడి’ విజయవంతంపై ప్రజల్లో ఇప్పటికే చర్చలు కొనసాగుతుండగా మౌలిక వసతులు, పాఠశాలల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు పరిష్కారం దిశగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు సమష్టిగా కూర్చొని క్షేత్రస్థాయిలో ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. పాఠశాలల ప్రగతిపై సమగ్రత లేకుండా నిధులు విడుదలైనా పథకం సమున్నత ఆశయం నీరుగారే ప్రమాదముంది. ఎందరో దాతలు స్థలాలను ఇవ్వగా, మరికొందరు భవనాలు కట్టించారు. కొన్ని చోట్ల పూర్వ విద్యార్థులు, దాతలు మౌలిక వసతులైన తాగునీరు, గ్రంథాలయం, పిల్లలకు బల్లాలు సమకూర్చారు. అయినా క్షేత్రస్థాయిలో నిబద్ధత, నిర్వహణ లోపం వంటి సమస్యలు తలెత్తాయి. స్థానిక ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో ప్రజలను మమేకం చేస్తే ప్రభుత్వాలు, దాతలు ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇదే ఒరవడితో ప్రభుత్వం పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేయడం, దాతలను ప్రోత్సహించేలా వారు వెచ్చించిన నిధులకు గౌరవాన్నిస్తూ పాఠశాలల్లో వారి పేర్లు చిరస్థాయిలో నిలిచిపోయేలా చొరవ తీసుకోవడం, నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచే లా పాఠశాల నిర్వహణ కమిటీ, ప్రధానోపాధ్యాయుడు, ఏఈ, సర్పంచ్తో కూడిన జాయింట్ చెక్ అకౌంట్ ద్వారా నిధులు విడుదల చేసే నిబంధనలను రూపొందించింది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం వేల కోట్ల నిధులు వెచ్చించేందుకు సిద్ధమై ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న తరుణంలో సమర్థవంతంగా నిధులు వినియోగమై విద్యార్థులకు ప్రయోజనం కలుగాలంటే గ్రామ విద్యాభివృద్ధి కమిటీల ఏర్పాటు ఎంతో కీలకం. తరగతుల వారీగా ఈ కమిటీలు ఎంతో ప్రభావశీలంగా ఉంటాయి. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసే విద్యాభివృద్ధి కమిటీ పాఠశాల సమగ్రాభివృద్ధిపై ప్రణాళిక చేయగలుగుతుంది. బాధ్యతను పెంచనంతసేపు ఎన్ని కోట్ల నిధులిచ్చినా పాఠశాలలపై ప్రజల్లో జవాబుదారీతనం లోపిస్తుంది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టి, సౌకర్యాలు కల్పిస్తే వాటి నిర్వహణలో వెయ్యి, రెండువేలతో లోపాలను సవరించుకునే అవకాశం ఉన్నా బాధ్యతారాహిత్యం కారణంగా కొన్నిచోట్ల భవనాలు, మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్లు శిథిలమైపోయాయి. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో వివిధ శ్రేణుల వారీగా చర్చించి రూపొందించుకున్న ప్రణాళికకు ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమాన్ని పరిశీలించి నిధులు మంజూరు చేయాలి. విద్యాభివృద్ధి కమిటీ బాధ్యులు, ప్రధానోపాధ్యాయులతో కూడిన సంయుక్త బ్యాంక్ ఖాతాలను తెరిచి నిధుల వినియోగంలో పారదర్శకత పాటించేలా చూడాలి. పాఠశాల యాజమాన్య కమిటీలు పంచాయతీ పరిధిలో వార్డు సభ్యులతో కలిపి విద్యా కార్యక్రమాల సమన్వయానికి ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి.
పాఠశాల స్థాయిలో 12 అంశాలపై బాలల సంఘాలను ఏర్పాటు చేయాలి. క్రీడా, గ్రంథాలయం, ల్యాబ్, కంప్యూటర్, మధ్యాహ్న భోజనం, పారిశుధ్యం, హరితహారం, ఆరోగ్యం, సాంస్కృతిక, విద్యాసామర్థ్యాలు తదితర కమిటీలతో విద్యార్థులను ప్రత్యక్షంగా భాగస్వామ్యం చేసినప్పుడు నాయకత్వ లక్షణాలను మెరుగుపర్చుకుంటారు. పాఠశాలపై విద్యార్థి దశలోనే బాధ్యతాయుత దృక్పథం అలవడుతుంది. వనరులను సద్వినియోగం చేసుకుని కాపాడుకోవడం వంటి విషయాలపై ఉపాధ్యాయులతో పాటు యాజమాన్య కమిటీలకు విద్యార్థులు సహకరించేలా బాలల సంఘాలను తీర్చిదిద్దాలి. పూర్వ విద్యార్థులు తరగతులను దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలి. మహిళా స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, విద్యాపోషకులను ఈ కమిటీల్లో భాగస్వామ్యం చేసి ప్రతి వారం పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించి బడి పని తీరుపై పర్యవేక్షించాలి. బడి మౌలిక అవసరాలను గుర్తిస్తూ పంచాయతీలు, ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన పనులను గుర్తించి అవి పూర్తి చేసేలా కమిటీలకు బాధ్యతలు విధించాలి.
ప్రభుత్వం మన ఊరు-మన బడి ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిధులు వెచ్చిస్తున్నది. మాతృభాష తెలుగు అస్థిత్వాన్ని దెబ్బతీయకుండా ఇంగ్లిష్ మీడియంలో కూడా రెండో సబ్జెక్టుగా విధిగా తెలుగును ఉంచేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. ప్రభుత్వ ఆశయం నెరవేరి పాఠశాలలు పూర్వ వైభవాన్ని పొందాలంటే ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైంది. పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారాన్ని తీసుకుంటూ బడిని బాగు చేసుకోవాలి. మేము అమ్మాపురం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల అభివృద్ధి కోసం పాటుపడ్డాం. అప్పటి సర్పంచ్ రమేశ్తో పాటు మరికొంత మంది కలిసి రూ.3లక్షల వరకు విరాళాలు సేకరించి పాఠశాలకు స్థలాన్ని కొనుగోలు చేసి పేయింట్స్ వేయించారు. ఇంగ్లిష్ మీడియం బోధన కోసం, పాఠశాల సమయం ముగిసిన తర్వాత సాయంత్రం వేళ వెనుకబడిన విద్యార్థులను చదివించేందుకు ప్రత్యేక ట్యూటర్లను నియమించాం. నేను సొంతంగా రూ.30వేల దాకా పాఠశాలకు వెచ్చించా. ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకురావడం, విధి విధానాలు రూపొందించి ప్రజల భాగస్వామ్యంతో సక్సెస్ చేస్తే కేసీఆర్ కలలు కంటున్న బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు పడుతాయి.
దేశ స్వాతంత్య్రానంతరం ఏ ప్రభుత్వం కూడా విద్య కోసం ఇంత భారీ ఎత్తున నిధులు కేటాయించిన దాఖలాల్లేవు. రాష్ట్రంలోని 4800 ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులకు కోసం ఒక్కో పాఠశాలకు సుమారు రూ.కోటికి పైగా నిధులు రానున్నాయి. ఇది ప్రభుత్వ పథకంగా భావించేలా కాకుండా గ్రామ భవిష్యత్ బడిపైనే ఆధారపడి ఉందన్న వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకునేలా విస్తృతమైన ప్రచారం చేసి వారి భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15ఏళ్లకు పైబడి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ విద్యాభివృద్ధి కమిటీలు సమష్టిగా కూర్చొని పాఠశాల అభివృద్ధిపై కార్యాచరణను రూపొందించుకుని నిధులు సమకూర్చుకున్నారు. పాలకుర్తి మండలంలోని తొర్రూరు ఉన్నత పాఠశాల కోసం రూ.12లక్షలు, ఇదే మండలంలోని చెన్నూరు పాఠశాలకు రూ.6లక్షల విరాళాలను సేకరించుకున్నారు. నెల్లికుదురు మండలం మునగలవీడు పాఠశాలకు అదనపు స్థలం కోసం నిధులు సేకరించి ఎకరం భూమి కొన్నారు. వర్ధన్నపేట మండలం ఐనవోలు పాఠశాల గ్రామస్తులు మధ్యాహ్న భోజనానికి కోతుల బెడదను నివారించేందుకు రూ.2.50లక్షలతో ప్రహారీకి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పంథిని పాఠశాలలో డిజిటల్ తరగతులకు రూ.2.50లక్షల నిధులు సేకరించారు. తొర్రూరు మండలం అమ్మాపురం పాఠశాల అభివృద్ధికి రూ.3లక్షల నిధులు దాతల నుంచి సేకరించి సద్వినియోగం చేసుకున్నారు. పాఠశాలల అవసరాల కోసం స్థానిక ప్రజల్లో ‘మన ఊరు-మన బడి’పై బాధ్యాయుతమైన చర్చ చేసి భావాత్మకమైన సంబంధాన్ని ఏర్పచుకోవాలి. ఈ పథకం ఆశయంపై అవగాహన కల్పించకుండా హడావుడిగా పనులు ప్రారంభిస్తే దాని ఉద్దేశం నీరుగారే ప్రమాదముంది.