అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగియగా, ఇక కౌంటింగ్కు సర్వం సిద్ధమవుతోంది. ఈమేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామగ్రిని ఆయా జిల్లాల పరిధిలోని స్ట్రాంగ్రూములకు చేరవేసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షించి సిబ్బందికి ఆదేశాలిస్తున్నారు.
ఇందులో భాగంగా వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లతో పాటు ఒక రిటర్నింగ్ అధికారి టేబుల్ ఉంటుంది. ఒక్కో కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఉంటారు. అలాగే ప్రతి టేబుల్ వద్ద ఒక అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంటు సూపర్వైజర్ విధులు నిర్వహిస్తారు. ఎప్పటికపుడు సమాచారం అందించేందుకుగాను ప్రత్యేకించి మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు.
మీడియా సెంటర్తో పాటు మైక్రో అబ్జర్వర్స్ వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరుగనుంది. అలాగే జనగామ శివారు పెంబర్తిలోని వీబీఐటీలో జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి సెగ్మెంట్ల ఈవీఎంలను భద్రపర్చగా అక్కడే లెక్కింపు నిర్వహించనున్నారు. భూపాలపల్లిలో అంబేద్కర్ స్టేడియంలో లెక్కింపు నిర్వహించనుండగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.