దేవరుప్పుల/పాలకుర్తి, మార్చి 11: ‘రిజర్వాయర్లలో నీళ్లున్నా కాల్వలకు విడుదల చేయని అసమర్థ ప్రభుత్వం ఇది.. అవగాహన లేని మంత్రులు, అధికారులతో సమన్వయ చేసుకోవడం లేదు.. దీని వల్ల యాసంగిలో నీళ్లందక పొలాలు ఎండిపోతున్నయ్.. రైతులు గోస పడుతున్నా కాంగ్రెస్ నేతలకు పట్టడం లేదు.. రైతుల ఉసురు వారికి తాకుతది.. రాజకీయాలొద్దు.. రైతులను ఆదుకోండి’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. కేసీఆర్ హయాంలో రైతులు ఇలాంటి కష్టాలు చూడలేదని, ఇప్పటికైనా దేవాదుల నుంచి నీటిని విడుదల చేయడంతో పాటు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సాగునీరందక ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు సోమవారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా, ధర్మగడ్డ తండా, సీతారాంపురం, ధర్మాపురం, పాలకుర్తి మండలం మైలారం శివారు టీకే నాయక్ తండా, మల్లంపల్లి బీకే నాయక్ పెద్దతండాల్లో క్షేత్రస్థాయికి వెళ్లారు. రైతులతో కలిసి వరి పొలాల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకొని ఓదార్చారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే రిజర్వాయర్ల నుంచి నీళ్లు విడుదల చేయాలని ఎర్రబెల్లి కోరారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామన్నారు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో గుంట పొలం ఎండకుండా సాగునీరందించామని గుర్తుచేశారు. దేవాదుల రిజర్వాయర్లలో నీళ్లున్నా విడుదల చేయడం లేదని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ పాలనలో వేసవిలో దేవరుప్పుల మండలంలోని చెరువులను నింపేవాళ్లమని, వాగులపై చెక్డ్యాములు అలుగు పోయడం వల్ల రైతులు ఏనాడూ సాగునీటి సమస్యను ఎదుర్కోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు గోస వచ్చిందని, ఎక్కడికి వెళ్లినా పంటలు ఎండిపోయి మూడు నెలల్లోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం ధరావత్ తండా, ధర్మగడ్డ తండాల్లో బోర్లు వేస్తున్న రైతులతో మాట్లాడారు. పంటలు ఎండుతుంటే పశువులను మేపుతున్నామని గిరిజన రైతు కుటుంబాలు ఎర్రబెల్లితో వివరించి కన్నీళ్లు పెట్టుకోగా నేనున్నాంటూ ఎర్రబెల్లి ధైర్యం చెప్పారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో వేలాది ఎకరాలు ఎండుతున్నట్టు రైతులు తెలిపారు.
ఇలాంటి కరువును ఎదుర్కొనేందుకే బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని మాజీ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఇంత మంచి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టే దండుగ అని ఆరోపణలు చేయడం తగదన్నారు. వానలు కురవకుంటే సాగు, తాగునీటికి ప్రజలు ఇబ్బందిపడాల్సి వస్తుందన్నారు. దేవరుప్పులలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సుందరరాంరెడ్డి, మండల శాఖ అధ్యక్షు డు దయాకర్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, ఏపీసీఎస్ చైర్మన్ రమేశ్రెడ్డి, నాయకులు మల్లేశ్, మండల ప్రధాన కార్యదర్శి రవి, సుందర్, కృష్ణమూర్తి, డైరెక్టర్లు జోగేశ్వర్, నర్సింహులు, అర్జున్, యాకయ్య, మాజీ సర్పంచ్ గేమానాయక్, సునీత, వెంక న్న పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలో ఎంపీపీ నాగిరెడ్డి, జడ్పీకోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్కుమార్, సొసైటీ చైర్మన్ అశోక్రెడ్డి, వ్యవసా య మార్కెట్ మాజీ చైర్మన్ రాంబాబు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, సొసైటీ వైస్ చైర్మన్ వేణు, ఎంపీటీసీ కళింగరావు, మాజీ ఎంపీపీ వెంకటయ్య, పవన్గౌడ్, మాజీ సర్పంచ్ మహేందర్నాయక్, జిమ్మిలాల్, సంపత్ శ్రీపాల్, వెంకన్న, వెంకన్న, మంగ్యానాయక్ పాల్గొన్నారు.
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలు విసిగిపోతున్నారని ఎర్రబెల్లి అన్నారు. తొందరపడకండి ఆరు నెలలు ఆగండి మనకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలపై నిరసనగా ఈ నెల 12న మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.