ములుగు జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. నాణ్యమైన విద్య, అత్యుత్తమ బోధన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో కేవీలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగులో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ పలు మార్లు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 28న జిల్లాలో కేంద్ర బృందం పర్యటించి మౌలిక వసతులను పరిశీలించనుంది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని కేవీఎస్ డిప్యూటీ కమిషనర్ కలెక్టర్కు లేఖ పంపించారు. దీంతో భవనంతోపాటు అనువైన స్థలాన్ని చూపించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది.
– ములుగు, జూన్23(నమస్తేతెలంగాణ)
ములుగు, జూన్ 23(నమస్తేతెలంగాణ) : అత్యుత్తమ సౌకర్యాలతో నాణ్యమైన విద్యకు చిరునామాగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న కేంద్రీయ విద్యాలయం ములుగు జిల్లాలో త్వరలో ఏర్పాటు కానున్నది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంతో డిమాండ్ ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పలుమార్లు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగా, ప్రభుత్వం స్పందించి ములుగులో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నెల 28న ములుగు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులను పరిశీలించనున్నట్లు ఇటీవల కేంద్రియ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ను లేఖ ద్వారా ఆదేశించారు. 1వ తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు సీబీఎస్ఈ సిలబస్తో విద్యార్థులకు బోధన అందుతుంది.
28న కేంద్ర బృందం రాక..
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ములుగులో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ సీతారాం నాయక్తో పాటు ప్ర స్తుత ఎంపీ మాలోత్ కవిత పార్లమెంట్లో డిమాండ్ చే శారు. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం ఈ విద్యాలయా న్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 2023 జనవరి 25వ తేదీన ములుగులో కేంద్రీయ విద్యాల యం ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపింది. 6 నెలల తర్వాత దీనికి మోక్షం లభించింది. కాగా, ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈ నెల 28న కేంద్ర మానవ వనరుల అభివృ ద్ధి శాఖ అధికారులు ములుగు జిల్లాలో పర్యటించనున్నా రు. విద్యాలయ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని చూపించేందుకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తున్నది.
విద్యార్థులకు నాణ్యమైన విద్య..
కేంద్రియ విద్యాలయం ఏర్పాటైతే ములుగు ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయి సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందనున్నది. సౌకర్యవంతమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గంథ్రాలయం, వైద్యం, క్యాంటిన్, క్రీడా సౌకర్యాలు అందుతాయి. ప్రయోగాత్మక అభ్యసన అనుభవాలను విద్యార్థులకు అందించేందుకు సైన్స్, కంప్యూటర్, లాంగ్వేజ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. గ్రంథాలయంలో కేంద్రీయ విద్యాలయ పుస్తకాలు, మ్యాగజైన్లు, వార్తా పత్రికలు, ఇతర రీడింగ్ మెటీరియల్ను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులకు సువిశాలమైన క్రీడామైదానాలను ఏర్పాటు చేసి క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్ వంటి క్రీడల కోసం పరికరాలను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులకు అవసరమైనప్పుడు వైద్య సహాయం అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించి పాఠశాలలో క్లినిక్ను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యత కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులకు వరుసగా రెండు, మూడు, నాలుగో ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన విద్యార్థులకు 5వ ప్రాధాన్యతతో ప్రవేశాలు కల్పిస్తారు.
విద్యార్థులకు మేలు..
– సీతారాం నాయక్, మాజీ ఎంపీ
ములుగు ప్రాంత బిడ్డగా విద్యార్థులకు మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రీయ విద్యాలయం కోసం పోరాటం చేశాం. నీళ్లు, నియామకాలు, నిధులు తెచ్చుకొని తెలంగాణను నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికి ఆదర్శంగా నిలిపాం. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుంది. కేంద్రీయ విద్యాలయం ములుగులో ఏర్పాటైతే విద్యార్థుల భవిష్యత్ బంగారు మయమవుతుంది.