దేవరుప్పుల, మే 30 : మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అమెరికాలోని డాలస్లో జూన్1న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవాలు- తెలంగాణ ఆవిర్భావ వేడుకల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపిన కేసీఆర్ పాలనను ఓడించిన ప్రజలు నేడు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు.
కేసీఆర్ లేని లోటు నేడు ప్రజలకు తెలుస్తున్నదన్నారు. పాలకుర్తిలో తనను ఓడించిన ప్రజలు తాము తప్పు చేశామని బాధపడుతున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ రైతు ధనవంతుడని చెప్పుకునేవారని, నేడు వ్యవసాయం సాగునీరు లేక, రైతుబంధు అందక, పండిన వడ్లు కొనక రైతు డీలా పడినట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో భూముల రేట్లు అమాంతం పడిపోయాయన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆదాయం సగానికి సగం తగ్గిందని, ముఖ్యమంత్రే నేరుగా తెలంగాణ దివాలాతీసిందని, అప్పుపుట్టడంలేదని బాహటంగా మీటింగ్లో చెబుతున్నారన్నారు.
డాలస్ వేడుకను విజయవంతం చేద్దాం
జూన్ 1న డాలస్లో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక, తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని వరంగల్ సభ స్ఫూర్తితో విజయవంతం చేయాలని నిర్వాహకులను ఆయన కోరారు. వరంగల్ సభ అంచనాలకు మించి జరిగిందని, పోలీసుల అడ్డంకుల మధ్య సభకు 9 లక్షల మంది హాజరైయారని అన్నారు. జూన్ 1న జరిగే సభకు కుటుంబాలతో రావాలని, తెలంగాణతోపాటు, బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభతో తెలంగాణలోని అమెరికా వాసులంతా మళ్లీ బీఆర్ఎస్ పాలన వచ్చేలా తమ వంతు పాత్ర పోషించాలన్నారు.