ఢిల్లీ గులామ్లకు సలాం కొట్టొద్దని, వారి మాట నమ్మితే మళ్లీ గోస పడడం ఖాయమని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిర్వహించిన ప్రగతి నివేదన సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి కాంగ్రెస్ పాలనలో పురుగుల మందే రైతులకు అన్నం అయిందని, నేడు ప్రత్యేక తెలంగాణలో రైతే రాజు అని పేర్కొన్నారు. ఢిల్లీ గులామ్ లకు సలాం కొట్టొద్దుప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని అన్నారు. అభివృద్ధిని కోరే చల్లాను భారీ మెజార్టీతో గెలిపించాలని, పదేండ్లలో నియోజకవర్గంలో రూ.5.5వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గీసుగొండ మండలంలో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మహిళలు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని చెప్పారు. సభలో చీఫ్ విప్ దాస్యం, మండలి డిప్యూటీ చైర్మన్ బండా, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ సిరికొండ, జడ్పీ చైర్పర్సన్ జ్యోతి పాల్గొన్నారు.
– పరకాల, అక్టోబర్ 9
పరకాల, అక్టోబర్ 9 : కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని, ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ హాట్రిక్ సీఎంగా నిలువనున్నారని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. పరకాల పట్టణంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వాసులుగా మనం ఎదుర్కొన్న అప్పటి పరిస్తితులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకోవాలన్నారు. వచ్చే నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని అన్నారు. 60 ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ అప్పుడు అమలు చేయని పథకాలు ఇప్పుడెట్ల అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి కరెంటు లేదు, మంచినీరు, సాగు నీరు లేదు, సంక్షేమం ఊసే లేదని, కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే కరెంటును ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆనాడు రైతన్నలు పురుగు మందు అన్నం తిని ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడు తెలంగాణలో రైతన్నలు సంతోషంగా పెరుగన్నం తింటూ వ్యసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారన్నారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పరకాల నియోజకవర్గానికి రూ.5.5వేల కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని కేటీఆర్ అన్నారు. వాటితో నియోజకవర్గం ఎనలేని అభివృద్ధిని సాధించి, రూపురేఖలను మార్చుకుందన్నారు. తన చినప్పుడు పరకాల పట్టణంలో చదువుకున్నానని అప్పటికీ, ఇప్పటికి పరకాల ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. పరకాల నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దేశానికే తలమానికంగా ఉంటుందన్నారు. అంతేకాకుండా ప్రజల చిరకాల వాంఛ అయిన పరకాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు.
ఆధునాతన హంగులతో ఆర్డీవో కార్యాలయం, తహసీల్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలను నిర్మించుకుని, ప్రారంభించుకున్నట్లు తెలిపారు. అంతే కాకుండా సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, మెడ్రన్ వైకుంఠధామాలు వంటి ఎన్నో అభివృద్ధి పనులను చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తమను ఎప్పుడు కలిసినా నియోజకవర్గ అభివృద్ధి పనులను మాత్రమే అడుగుతాడన్నారు. నియోజకరవర్గం అభివృద్ధి కోసం పరితపించే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చల్లా ధర్మారెడ్డి అని కొనియాడారు. అందుకే పరకాలలో చల్లా ధర్మారెడ్డిపై పోటీ చేసేందుకు విపక్షాలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ధర్మారెడ్డిని 70 వేల మెజార్టీ గెలిపించాలని కోరారు.
దేశంలో ప్రజల కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎప్పటికప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్దిని, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తున్నారన్నారు. తండ్రి బాటలో నడుస్తున్న మంత్రి కేటీఆర్ నిరంతరం యువతలో స్ఫూర్తిననింపుతూ ప్రపంచ పటంలో హైదరాబాద్కు ప్రత్యేక స్థానాన్ని కల్పించారన్నారు. కృషి వల్లే రాష్ట్రంలో పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడుతు పెట్టాయన్నారు. కాగా, పరకాలలో ఇప్పటికే కొంత అభివృద్ధి జరిగినా మరింత అభివృద్ధి జరుగాల్సి ఉందన్నారు.
అందుకు నియోజకరవ్గ ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలువాలన్నారు. గ్రామాల్లో తిరిగే విపక్ష పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. వారి మాటలు నమ్మితే గోస పడుతామన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చే సీఎం కేసీఆర్ కావాలో, 3గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కార్పొరేట్ వ్యక్తులకు రూ.17వేల లక్షల కోట్ల రుణా మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలన్నారు. నిరంతరం అబివృద్ధ్దిని కోరుకునే కేసీఆర్ మరో పది కాలాల పాటు అధికారంలో ఉంటేనే పేద ప్రజలకు మరింత సంక్షేమం అందుతుందన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవన విధానం మారిందని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి అన్నారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెకక్టును పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. సంక్షేమ పథకాలు రాజకీయాలకతీతంగా, పారదర్శకంగా అమలువుతున్నాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం కొనసాగాలంటే కేసీఆర్ను సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు.
స్వరాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఆయన పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. కుల వృత్తులకు పునర్వైభవం దక్కిందని, అంతేకాకుం డా ఎంతో మంది బీసీలకు పదవులు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తికి ప్రజలంతా అండ గా నిలవాలని కోరారు. ఉమ్మడి పాలనలో పరకాల ప్రాంతం అభివృద్ధికి దూరంగా నిలిచిందని, కానీ, ప్రత్యేక రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తూ ముందంజలో నిలిచిందన్నారు.
ఎన్నికలకు ముందే పరకాలలో చల్లా ధర్మారెడ్డి గెలుపు ఖాయమైందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తొమ్మిదిన్నర ఏండ్లలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధిని సాధించిందన్నారు. రాష్ర్టంలో మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సభ కు వచ్చిన జనాన్ని చూస్తే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు అడ్డేలేదని, ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి విజయం ఖాయమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీ దయాకర్, అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, లింగంపల్లి కిషన్రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, చింతం సదానందం, మున్సిపల్ చైర్పర్సన్ సోదాఅనితా రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.