శాయంపేట, డిసెంబర్ 26 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరును ఇక ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదానితనం పెంచేందుకు ఈ చర్యలను చేపట్టారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయగా, దీనికి అనుగుణంగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉపాధి కూలీల హాజరు నమోదు మ్యానువల్గా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ ఎన్ఐసీ తెచ్చిన తర్వాత ఎన్ఎంఎంఎస్ ద్వారా కూలీల హాజరు కొనసాగించారు. అయితే, కొంత కాలం నుంచి అది ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో వచ్చే జనవరి ఒకటి నుంచి యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పెంచేందుకు యాప్ను తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో కూలీలపై నిత్యం ఆన్లైన్ పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. గ్రామ స్థాయిలో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కంప్యూటర్ సెంటర్ నుంచి యాప్ను రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తర్వాత వర్క్ సైట్లో డిమాండ్ పెట్టిన విధంగా పనికి వచ్చిన సుమారు ఇరవై మంది కూలీల గ్రూపు ఫొటోను ఉదయం పది గంటల లోపు ఎన్ఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇదీ నేరుగా కేంద్ర ప్రభుత్వంలోని సైట్కు వెళ్తుందని, దీనికి టైమ్ స్టాంప్, జియోట్యాగింగ్తో లింకై ఉంటుందని వివరించారు. యాప్తో కూలీల పేర్లు లింకై అప్లోడ్ అవుతాయని పేర్కొన్నారు.
జనవరి ఒకటి నుంచి కూలీల మ్యానువల్ నమోదును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా హాజరును వ్యక్తిగత లబ్ధిదారుల పథకం నుంచి మినహాయించారు. ఉపాధి హామీ కూలీల హాజరును వంద శాతం ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా పంపించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు. ఉపాధి హామీలో రోజుకు ఎంత మంది కూలీలు వస్తున్నారు? పనితీరు వంటి అంశాలను నేరుగా ఢిల్లీ స్థాయిలో వీక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఎంత మంది కూలీలు పనిచేశారో ఆ రోజు కూలీల పేర్లు, సంతకాలతో మ్యానువల్ మస్టర్ ఇస్తేనే కూలీ డబ్బులు అందుతాయని ఈజీఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటీకే ఉపాధి హామీలో సాఫ్ట్వేర్ను మార్చి నేరుగా కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మరిన్ని మార్పులు జరిగినట్లు పేర్కొన్నారు.