గణపురం, డిసెంబర్ 14 : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతోనే సింగరేణి మనుగడ సాధ్యమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు బాణం గుర్తుకు ఓటువేసి టీబీజీకేఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కేటీకే-8వ గని వద్ద గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీబీజీకేఎస్ ఎల్లప్పుడు పోరాడుతుందని, కేసీఆర్ నాయకత్వంలో కార్మికులకు ఎన్నో హక్కులను కల్పించామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేగా సింగరేణి కార్మికుల క్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశానన్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వారసత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు.
గతంలో ప్రతిభాపరమైన ఉద్యోగాలు కల్పంచాలని సీఎంను కోరానని, అందరూ బదిలీ వర్కర్లుగా కాకుండా విద్యాపరమైన ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశానని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో 16శాతం ఉన్న లాభాల వాటాను 32 శాతానికి పెంచిన ఘనత టీబీజీకేఎస్కే దక్కుతుందన్నారు. కార్మికులు ఎటువంటి సమ్మె చేయకుండానే వారికి అన్ని రకాల హక్కులను కల్పించామన్నారు. కార్మికులకు టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, సెంట్రల్ కమిటీ మెంబర్ బత్తుల వెంకటేశ్, నాయకులు సదానందం, సమ్మిరెడ్డి, రఘోత్తంరెడ్డి, శంకర్రెడ్డి, జగత్రావు, శంకర్, రాంచందర్, పాషా, శివ, రాజేందర్, రాజూనాయక్, రత్నం అవినాశ్, లక్కాకుల శ్రీనివాస్, మునిగాల సురేశ్, తాళ్లపల్లి శశికాంత్గౌడ్, చక్రపాణి పాల్గొన్నారు.