హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 3: అవకాశవాది కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మొదటిగేట్ వద్ద బుధవారం కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి, కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి, తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరికి సిగ్గులేదన్నారు.
నీతినిజాయితీ ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం కావ్యను ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయబోమన్నారు. తాటికొండ రాజయ్య, పసునూరి దయాకర్, అరూరి రమేశ్ వంటి వారిని అప్రతిష్ట పాలు చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి వెళ్లగొట్టాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో తన కూతురి కోసం బ్లాక్ మెయిల్ రాజకీయాలు సైతం చేశాడన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కార్యదర్శి కంజర్ల మనోజ్, సంగని సూర్యకిరణ్, అరూరి రంజిత్, లంక రాజ్గోపాల్, కలకోట్ల సుమన్, గొల్లపల్లి వీరస్వామి, అశోక్ పాల్గొన్నారు.