హనుమకొండ సిటీ, జూన్ 20 : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా వెలిగిపోతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం అంబేద్కర్ భవన్లో డీఈవో అబ్దుల్ హై అధ్యక్షతన విద్యాదినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వినయ్భాస్కర్ హాజరై మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం రూ.లక్షల కోట్లు వెచ్చిస్తోందన్నారు. దానికి తగ్గట్లుగా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడం వల్ల గురుకులాలు, పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. 2010లో ప్రభుత్వపాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ఓ కమిటీ వేసి, సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తగా అప్పటి సీఎం వైఎస్ ప్రభుత్వ పాఠశాలలపై పెట్టుబడి దండుగా అని అన్నారన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్య మం, స్వరాష్ట్ర సాధన తర్వాత మన ఊరు- మన బడి ద్వారా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. అయినా ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జూలై మాసంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమై పాఠశాలల్లో కావాల్సిన అవసరాలపై చర్చించి, వాటిని తీర్చిదిద్దుతానన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు వారు పనిచేసిన, చదువుకున్న పాఠశాలలపై దృష్టిసారించాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ అందరికీ ఒకేలా విద్యనందిచేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ రంగంలో చదివేలా సంస్కరణలు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. అంబేద్కర్ భవన్ ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాను అందరూ ఆసక్తిగా తిలకించారు. విద్యాదినోత్సవం రోజు 32 పాఠశాలల్లో ఉదయం రాగిజావ అందజేయగా, వేదికపై రాగిజావా సరఫరా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అలాగే, 334 ట్యాబ్స్కు జిల్లాకు రాగా, వేదికపై 4 ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంలకు ట్యాబ్స్ అందజేశారు. పది, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ విద్యార్థులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు, టీఎల్ఎం మేళా విజేతలను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, సెక్టోరియల్ అధికారులు అంబటి శ్రీనివాస్రెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్, రాధ, సునీత, ఎంఈవోలు రాంకిషన్రాజు, వెంకటేశ్వర్లు, రమాదేవి, ఓపెన్ టెన్త్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్రావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మందల తిరుపతిరెడ్డి, పలిత శ్రీహరి, ఎడ్ల ఉపేందర్రెడ్డి, పెండెం రాజు పాల్గొన్నారు.
యోగాను మించిన చికిత్స లేదు
మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో యోగాను మించిన చికిత్స లేదని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వికాస తరంగిణి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమం సన్నాహక సమావేశాన్ని నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్బంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించచే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నగరంలోని యువత, యోగా సాధకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.