ములుగు, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ) : మేడారం మహా జాతర సమష్టి కృషితో పూర్తయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. జాతర ముగిసిన సందర్భంగా బుధవారం గిరిజన భవన్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్తో కలిసి మంత్రి మీడియా ప్రతినిధులకు కృతజ్ఞత సమావేశాన్ని నిర్వహించారు. వనదేవతల కీర్తిని ప్రపంచానికి తెలియజేసిన మీడియాకు అభినందనలు తెలిపారు. మొదటిసారిగా జాతరలో మంత్రిగా అన్ని కార్యక్రమాలను నిర్వహించానని అన్నారు. జాతరపై తనకు ఎంతో అనుభవం వచ్చిందన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతర పూర్తయిందన్నారు. ప్రతి ఒక్కరి అనుభవాలను పుస్తక రూపంలో పొందుపర్చి లోపాలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. వన ప్రవేశం చేసే సమయంలో చిరుజల్లులు కురిసి అమ్మవారి దీవెనలకు సంకేతంగా నిలిచాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గిరిజన యూనివర్సిటీ తరగతులను జాకారం వైటీసీలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
రామప్ప సరస్సులోకి వస్తున్న గోదావరి జలాలను లక్నవరం సరస్సులోకి మళ్లించే పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మీడియా ప్రచారం ద్వారానే అంచనాలకు మించి భక్తులు అధిక సంఖ్యలో జాతరకు వచ్చారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గత జాతరతో పోల్చితే ఈ జాతరలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టామని ఎస్పీ శబరీష్ అన్నారు. మంత్రి పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతోనే జాతర విజయవంతమైందన్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను మంత్రి, కలెక్టర్, ఎస్పీలు శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, బెల్లం(బంగారం) అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, డీఎస్పీ రవీందర్, మేడారం ఈఓ రాజేంద్రం, ఐపీఆర్ ఏడీ లక్ష్మణ్, డీపీఆర్వో రఫిక్, సీఐ మేకల రంజిత్కుమార్, ఎస్సై వెంకటేశ్వర్, తహసీల్దార్ విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.