వరంగల్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9న రెండోవిడుత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నది. ప్రతి నియోజకవర్గంలో 24 యూనిట్ల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. వరంగల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 72 యూనిట్లను అందించనున్నది. ఈమేరకు 1,512 గొర్రెల కొనుగోలుకు జిల్లా అధికారులు లబ్ధిదారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు వెళ్లారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 9న ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో సంక్షేమ దినోత్సవం జరుగనున్నది. ఇందులో గొర్రెల పెంపకందారులకు రెండోవిడుత గొర్రెల పంపిణీ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండోవిడుత గొర్రెల పంపిణీపై మార్గదర్శకాలను విడుదల చేసింది. నియోజకవర్గంలో పెంపకందారులకు సబ్సిడీ గొర్రెలను అందజేయాలని పేర్కొంది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొంటారని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి 24 చొప్పున మూడు నియోజకవర్గాల్లో 72 యూనిట్ల గొర్రెలను ఈనెల 9న ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. నర్సంపేట, ఖిలావరంగల్, వర్ధన్నపేటలో జరిగే ఈ పంపిణీ కార్యక్రమాల్లో జిల్లా ఉన్నతాధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల నేతలు పాల్గొంటారు.
గొర్రెల కొనుగోలు కోసం కడపకు..
జిల్లాలో రెండోవిడుత గొర్రెల పెంపకందారులకు పంపిణీ చేసే సబ్సిడీ గొర్రెలను ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కడప జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని మరో జిల్లాలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల కోరిక మేరకు ఆయా మూడు జిల్లాల్లో ఏదేని జిల్లాలోనూ గొర్రెలను కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 9న సబ్సిడీ గొర్రెలను అందుకునే లబ్ధిదారులు కడప జిల్లాలో గొర్రెలను కొనుగోలు చేయాలని అధికారులను కోరినట్లు తెలిసింది. దీంతో సబ్సిడీ గొర్రెల కొనుగోలు కోసం వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు లబ్ధిదారులతో కలిసి ఆదివారం కడప జిల్లాకు బయల్దేరాయి. ముందుగా లబ్ధిదారులు వెళ్లారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల్లో 72యూనిట్లు అంటే 1,512 గొర్రెలను మూడు నాలుగు రోజుల్లో కొనుగోలు చేసి, వాటిని లారీల ద్వారా 9న ఉదయం జిల్లాకు తీసుకొస్తారు. ఒక్కో లారీ ద్వారా ఆరు యూనిట్లు అంటే 126 గొర్రెలు వస్తాయని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి బాలకృష్ణ వివరించారు. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గ కేంద్రానికి నాలుగు లారీల ద్వారా ఈనెల 9న ఉదయం వరకు 504 గొర్రెలు చేరుకుంటాయని తెలిపారు. ఇందుకోసం రవాణాకు ఏర్పాట్లు చేశామని, మూడు నియోజకవర్గ కేంద్రాల్లో 72మంది లబ్ధిదారులకు 1,512 గొర్రెల పంపిణీ జరగనుందని వెల్లడించారు.
ఒక్కో లబ్ధిదారుడికి 21 గొర్రెలు
ఒక్కో లబ్ధిదారుడికి 21 గొర్రెలతో కూడిన యూనిట్ పంపిణీ జరగనున్నది. ఈ యూనిట్లో 20 ఆడ గొర్రెలు, ఒకటి పోతు ఉంటుంది. రెండోవిడుత గొర్రెల పంపిణీ నిర్వహణకు 21 గొర్రెల యూనిట్ విలువ మొత్తాన్ని ప్రభుత్వం రూ.1.75 లక్షలకు పెంచింది. లబ్ధిదారులకు ఇందులో 75శాతం సబ్సిడీగా ఇస్తుంది. రూ.1.75లక్షల యూనిట్ మొత్తంలో లబ్ధిదారు తన 25శాతం వాటాధనం రూ.43,750 చెల్లిస్తే ప్రభుత్వం మిగతా 75శాతం అంటే రూ.1,31,250 సబ్సిడీగా అందజేస్తున్నది. జిల్లాలోని 199 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో 23,252 మంది సభ్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో తొలి విడుత ప్రభుత్వం 10,470 మంది గొర్రెల పెంపకందారులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేసింది. రెండోవిడుత 12,782 మంది గొర్రెల పెంపకందారులకు సబ్సిడీ గొర్రెలను అందజేయాల్సి ఉంది. వీరి నుంచి సబ్సిడీ గొర్రెల కోసం కొద్దిరోజుల నుంచి అధికారులు 25శాతం వాటాధనాన్ని సేకరిస్తున్నారు. చెల్లించిన వారిలో 72మంది లబ్ధిదారులకు ఈనెల 9న గొర్రెల పంపిణీ జరగనుంది. అనంతరం రెండోవిడుత జాబితాలో పేరు గల లబ్ధిదారులందరికీ సబ్సిడీ గొర్రెలను అందజేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.