– 1.2 కిలోల గంజాయి స్వాధీనం, ఏడుగురి అరెస్టు
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
కోదాడ, ఆగస్టు 17 : కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం శివారులో గంజాయి విక్రయానికి యత్నిస్తున్న ఏడుగురిని కోదాడ టౌన్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 1.2 కిలోల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీరంగాపురం శివారులోని మామిడి తోట వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఉదయం సమయంలో 10 మంది వ్యక్తులు నాలుగు ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకున్నారు. గంజాయితో కూడిన బ్యాగును తీసుకొచ్చి విక్రయించే విషయమై చర్చిస్తుండగా పోలీసులు దాడి చేశారు. పోలీసులను గమనించిన ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకున్నారని మిగిలిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి లభించిందన్నారు.
గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేందుకు సమయతమైనట్టు పేర్కొన్నారు .విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకొచ్చి, కోదాడ, మేళ్లచెరువు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై ఎన్డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. పరారైన మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.