అమరావతి : ఏపీలో కూటమి పాలనలో పరిస్థితులు దారుణంగా దిగజారాయని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( YS Jagan Mohan Reddy ) ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి ( Ganja ) , మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లతో ప్రజలకు అడ్డంగా దొరికిపోవడంపై ‘ఎక్స్’ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని సులభంగా కొట్టిపారేయలేమని అన్నారు.
రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికే ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడం వల్లే వ్యవస్థలు దిగజారాయయని ఆరోపించారు. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టాలని చంద్రబాబుకు సూచించారు.