Amit Shah : దేశంలో భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్న ఉగ్ర నెట్వర్క్ను భద్రతా బలగాలు అంతం చేశాయి. ఈ ముఠాకు చెందిన దాదాపు 200 మంది సభ్యుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ఉగ్ర నెట్వర్క్ను నాశనం చేసిందని షా అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సహా వివిధ భద్రతా బలగాల సాయంతో ఉగ్ర నెట్వర్క్ ముఠాను పట్టుకున్నారు.
షాహజాద్ భట్టి నెట్వర్క్ (ఎస్బీఎన్) అనే సంస్థ పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్త ఐఎస్ఐకి అనుకూలంగా పని చేస్తుంది. ఈ సంస్థలో 200 మంది వరకు సభ్యులు ఉన్నారు. వీరంతో దేశంలో భారీ కుట్రకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ఈ సభ్యులు పోలీసులు, రక్షణకు సంబంధించిన ప్రదేశాలు, మతపరమైన ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు. పలు చోట్ల నిఘా కోసం సీసీటీవీ కెమెరాల్ని కూడా ఏర్పాటు చేశారు. సంబంధిత సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారు. అయితే, ఎస్బీఎన్ కుట్రను భారత నిఘా విభాగం, భద్రతా బలగాలు చేధించాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న నెట్వర్క్ సభ్యుల్ని అరెస్టు చేశాయి. ఇందుకోసం ఆగష్టు 15న అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి సమన్వయంతో దాడులు నిర్వహించారు.
అన్ని రాష్ట్రాల అధికారులు, సెంట్రల్ ఏజెన్సీస్ కలిపి దాడులు చేసి వివిధ రాష్ట్రాల్లో దాదాపు 200 మందిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టల్స్, లైవ్ క్యాట్రిడ్జెస్, సీసీటీవీ కెమెరాలు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిపై పాకిస్తాన్ మార్క్ ఉన్నట్లు గుర్తించారు. ఇక అనేక ఉగ్ర కార్యాకలాపాల్లో ఈ ముఠా పాల్గొన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. తమ ప్రభుత్వం తీవ్రవాదాన్ని ఎంతమాత్రం సహించబోదని ఆయన అన్నారు. అరెస్టు అయిన వారిపై ఉపా సహా వివిధ చట్టాల కింద కేసు నమోదు చేశారు.
వీరిలో యూపీ నుంచి 62 మంది, ఢిల్లీ నుంచి 51 మంది, పంజాబ్ నుంచి 44 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, మహారాష్ట్ర నుంచి 8 మంది, ఉత్తరాఖండ్ నుంచి 5గురు, కర్ణాటక, బిహార్, గుజరాత్ నుంచి ముగ్గురు చొప్పున, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ నుంచి ఇద్దరు అరెస్టయ్యారు. వీరందరిపై ఢిల్లీ, కర్ణాటకల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దాదాపు 80 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.