హనుమకొండ, ఏప్రిల్ 26 : ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారి నలభై ఏళ్ల నిరీక్షణను సీఎం కేసీఆర్ తీర్చారని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గుడిసెవాసుల ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. పేదలకు గూడు, నీడ కల్పించాలనే సంకల్పంతో జీవో నెం 58ను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి అమలు చేస్తున్నారన్నారు. దీంతో గుడిసెవాసుల నిరీక్షణకు తెరపడిందన్నారు. చాలా మంది గుడిసెవాసు లు అవగాహన లేక ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేదన్నారు. క్షేత్ర స్థాయిలో నిరుపేదలకు అవగాహన కల్పించేందుకే గుడిసెవాసుల ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. 75 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు నిరుపేదలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పేదలకు భద్రత, భరోసా కల్పిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. ఇప్పటికే చాలా మందికి 58 జీవో పట్టాలను అందించినట్లు తెలిపారు.
రెండు రోజుల క్రితం కూడా పోచమ్మకుంటలో పట్టాల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒకరికీ హకు కల్పించాలనే నియోజకవర్గవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. గుడిసెలు వేసుకున్న అర్హులైన పేదలు ఈ నెల 30 లోపు 58 జీవో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అధికారులతో సమన్వయం చేసుకుని హకు కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాజీపేటలోని ఏఆర్ఆర్ నగర్, హనుమకొండలో నాగేంద్రనగర్, ప్రగతినగర్, బంజారా కాలనీలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి, గుడిసె వాసులతో మాట్లాడినట్లు చీఫ్ విప్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం వాసుచంద్ర, తహసీల్దార్లు కిరణ్కుమార్, రాజ్కుమార్, ఆర్ఐలు దశరథరామిరెడ్డి, సురేందర్, ప్రసాద్, కార్పొరేటర్లు సంకు నర్సింగ్, ఏనుగుల మానసా రాంప్రసాద్, డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను చీఫ్ విప్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యలు విని, వారి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానన్నారు.
విశ్రాంత ఉద్యోగుల మానసిక ఉల్లాసానికి రిక్రియేషన్ క్లబ్లు
విశ్రాంత ఉద్యోగుల మానసికోల్లాసానికి రిక్రియేషన్ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని రిటైర్డ్ లెక్చరర్స్ కార్యాలయంలో సాయంత్రం సరదాగా చీఫ్విప్ వారితో క్యారం ఆడారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల మార్గదర్శనం సమాజానికి ఎంతో అవసరమన్నారు. ఎక్కడలేని విధంగా హనుమకొండలో విశ్రాంత ఉద్యోగులకు రిక్రియేషన్ క్లబ్లను ప్రభుత్వ అధికారిక భవనాల్లో కేటాయించినట్లు తెలిపారు. కలెక్టర్ సహకారంతో ఇప్పటి వరకు పలు సంఘాలకు కార్యాలయాలు కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన సంఘాలకు కూడా త్వరగా కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు.