వరంగల్, సెప్టెంబర్ 21(నమస్తేతెలంగాణ) : గృహలక్ష్మి పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. తొలి విడుత లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే కార్యక్రమం శుక్రవారం జిల్లాలో ప్రారంభం కానుంది. గీసుగొండ మండలానికి చెందిన 432 మందికి ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ జరుగనుంది. ఊకల్ క్రాస్ రోడ్డులోని ఎస్ఎస్ గార్డెన్స్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య పాల్గొననున్నారు. సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకొనే స్థోమత లేని పేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకొనే వారికి మూడు దశల్లో రూ.3 లక్షలు అందజేయాలని నిర్ణయించింది. తొలి విడుత ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లను కేటాయించింది. ఈ లెక్కన జిల్లాకు 9,750 ఇండ్లు మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు. వీటి కోసం గత నెలలో దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 44,736 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు.
నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 18,896 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ మండలం వారీగా నర్సంపేటలో 3,781, ఖానాపురంలో 3,040, చెన్నారావుపేటలో 2,701, నెక్కొండలో 3,343, నల్లబెల్లిలో 3,322, దుగ్గొండిలో 2,709 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 5,450 మంది దరఖాస్తులను అందజేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలంలో 4,476 దరఖాస్తులు వచ్చాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండలం నుంచి 2,942, వర్ధన్నపేట మండలం నుంచి 4,243, జీడబ్ల్యూఎంసీకి చెందిన డివిజన్ల నుంచి 1,232, పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలం నుంచి 1,955, సంగెం మండలం నుంచి 4,172, జీడబ్ల్యూఎంసీకి చెందిన 15, 16, 17 డివిజన్ల నుంచి 1,370 దరఖాస్తులు అందినట్లు అధికారులు వివరించారు. దరఖాస్తులను వివిధ స్థాయిల్లో పరిశీలించి అర్హులను గుర్తించి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు.
పరిశీలనలో 7,847 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 36,889 మంది దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. నర్సంపేట నియోజకవర్గంలోని 16,295 మందిలో మండలం వారీగా నర్సంపేట నుంచి 3,495, ఖానాపురం నుంచి 2,707, చెన్నారావుపేట నుంచి 2,096, నెక్కొండ నుంచి 2,851, నల్లబెల్లి నుంచి 3,044, దుగ్గొండి నుంచి 2,102 మంది ఉన్నారు. వరంగల్తూర్పు నియోజకవర్గం నుంచి 4,540 మంది అర్హులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాయపర్తి మండలం నుంచి 3,156, వర్ధన్నపేట నియోజకవర్గంలోని 6,650 మందిలో పర్వతగిరి మండలం నుంచి 2,260, వర్ధన్నపేట మండలం నుంచి 3,269, జీడబ్ల్యూఎంసీ పరిధి నుంచి 1,121, పరకాల నియోజకవర్గంలోని 6,248 మందిలో గీసుగొండ మండలం నుంచి 1,504, సంగెం మండలం నుంచి 3,504, జీడబ్ల్యూఎంసీకి చెందిన 15, 16, 17 డివిజన్ల నుంచి 1,240 మంది అర్హుల జాబితాలో ఉన్నట్లు తెలిపారు. తాజా గా లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియను చేపట్టారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం వివిధ పథకాల అమలుపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహలక్ష్మి పథకం ఇండ్ల లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేయాలని, రెండు వారాల్లో మంజూరు పత్రాల పంపిణీ పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలోని అధికారులతో సమావేశమై లక్ష్యాలను నిర్దేశించారు. గహలక్ష్మి లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేసి ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయాలని ఆదేశించారు.