నర్సంపేట,ఆగస్టు 25 : ఆధునిక యంత్రాలతో రైతులు సాగు చేసి, ఆర్థికాభివృద్ధి సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. శుక్రవారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.75 కోట్లతో రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందించేందుకు యంత్రాల ప్రదర్శన, రూ.37 కోట్ల విలువైన పంట నష్టపరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొత్తసాలు రోజునే నర్సంపేట ప్రాంతంలోని అడివి రంగాపురం గ్రామాన్ని సందర్శించారని తెలిపారు. అప్పుడే ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా చూసి చలించిపోయారన్నారు. అందుకే నర్సంపేట నియోజకవర్గంలోని రైతులను ఆదుకునేందుకు వీలైనన్ని పథకాలను అందిస్తున్నారని తెలిపారు. రైతులు పడుతున్న బాధలను గుర్తించి, సహాయం చేయడానికి సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించారన్నారు. జిల్లాకు రూ.62 కోట్లు మంజూరైతే అందులో నర్సంపేటకు రూ.42 కోట్లు మంజూరయ్యాయన్నారు. దీనిలో ఇప్పుడు మొదటి విడుతగా రూ.37 కోట్లు రైతులకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
రైతులకు పైలట్ ప్రాజెక్టు కింద సీఎం కేసీఆర్ 150 కోట్లు ఆధునిక వ్యవసాయ పరికరాలను మంజూరు చేశారని అందులో నర్సంపేటకే రూ.75 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. దీనిలో సబ్సిడీ పోను రూ.37.5 కోట్లు మంజూరైనట్లు వివరించారు.. రైతులకు ఆధునిక పనిముట్లు అందించేందుకు కలెక్టర్ వివిధ కంపెనీల నుంచి టెండర్లు నిర్వహించి, తక్కువ ధరలకు అందించే కంపెనీలకు అనుమతి ఇచ్చారన్నారు. 161 రకాల పరికరాలకు అనుమతులు వచ్చాయని, రైతులకు అందుబాటులో ఉండేందుకు రెండు రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. రైతులు వాటిని పరిశీలించిన తర్వాతే గ్రామాల్లోని రైతు వేదికల వద్ద ఏఈవోలకు సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొత్తం 51 వేల మంది రైతులకు ఈ సబ్సిడీపై చిన్న పరికరాలు అందిస్తామని, పెద్ద పరికరాలను రైతు సంఘాలు, సొసైటీలు తీసుకుంటే సబ్సిడీలు అందిస్తారని తెలిపారు. ఒక్కో రైతుకు రూ.50 వేల సబ్సిడీ అందించేలా అధికారులు చూడాలని సూచించారు. సెప్టెంబర్ 15 వరకు ఈ పథకంలో రైతులకు పరికరాలు అందిస్తామన్నారు. రైతులు వడగండ్లతో నష్టపోయి ఉంటే నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు ప్రతిపక్ష నాయకులు వారిని పట్టించుకున్న పాపన పోలేదన్నారు. మళ్లీ ఎన్నికల్లో వారు ఏ మోహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. 24 గంటలు రైతుల క్షేమం గురించి ఆలోచించే తనను ఆశీర్వదించాలని కోరారు. 30 వేల టార్ఫాలీన్ షీట్లను 50 శాతం సబ్సిడీపై అందిస్తామన్నారు. 18వేల మంది రైతులకు పీవీసీ పైపులు, 4వేల మంది రైతులకు కరెంటు మోటార్లు సబ్సిడీపై అందిస్తామని వివరించారు.
పరికరాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ పరికరాలను అందించేందుకు జిల్లాకు రూ.75 కోట్లు కేటాయించిందన్నారు. దీనిలో సబ్సిడీ రూ.37.5 కోట్లు ఉందన్నారు. వీటితో పరికరాలను అందించేందుకు నేరుగా కంపెనీల నుంచి టెండర్లు కోరామన్నారు. తక్కువ రేటుకు ఇస్తున్న కంపెనీలను నిర్ణయించామని తెలిపారు. 540 పరికరాలు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు వాటిని పరిశీలించి తీసుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలు దుకాణం బంద్ అవుతుందని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. నర్సంపేటలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలతో పాటు, పైలట్ ప్రాజెక్టులతో ప్రతిపక్షాలు ఇక్కడ పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి ఈ ప్రాంత ప్రజల కోసం అన్ని రకాల ప్రాజెక్టులు తీసుకొస్తున్నారన్నారు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్రెడ్డి తగ్గేదేలేదు అనే రీతిగా ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తున్నారన్నారు. ఆయనను మళ్లీ ఆశీర్వదించి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీవాత్సవ, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జేడీఏ ఉషాదయాళ్, ఏడీఏ శ్రీనివాసరావు, ఎంపీపీ మోతె కళావతి, రమేశ్, జడ్పీటీసీ కోమండ్ల జయ, పత్తినాయక్, జడ్పీ ఆప్షన్ సభ్యుడు రఫీ, చెట్టుపెల్లి మురళి, బుర్రి తిరుపతి, గుంటుక సోమయ్య, గుంటి కిషన్ పాల్గొన్నారు.