ఏదారి చూసినా ఇసుక పోస్తే రాలనంత జనం..
ఏదిక్కు చూసినా కనుచూపుకందని గుడారాల సమాహారం..
ఏ చెట్టు చూసినా.. ఏ పుట్ట చూసినా వెదజల్లే ఆధ్యాత్మిక పరిమళం..
ఎవరిని తట్టినా అమ్మవార్లపైనే పరధ్యానం..
ఏదో అంతుపట్టని ఆవాహనం.. అంతులేని పారవశ్యం.. అవధుల్లేని ఆనందం..
వీరగడ్డ మేడారంలోనిదీ అనుభూతి పర్వం..
దేశ నలుమూలల నుంచీ పోటెత్తుతున్న భక్తులతో మేడారంలో జన విస్ఫోటనం కనిపిస్తున్నది. తల్లుల ధ్యాసలో లీనమై తరలివస్తున్న కోట్లాది మందికి వనమాత విడిది ఇస్తున్నది. చీమలదండులా వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నవారితో సంపెంగవాగు జనసాగరమవుతున్నది. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి బిడ్డ సారలమ్మ, గురువారం రాత్రి చిలుకల గుట్ట నుంచి తల్లి సమ్మక్క వచ్చి మేడారంలో గద్దెలపై ఆసీనులు కాగా మొక్కులు చెల్లించేందుకు భక్తులు ఎగబడుతున్నారు.
పసుపు కుంకుమలు, గాజులు, కంకబియ్యం (ఒడిబియ్యం), ఎత్తుబంగారం, ఎదురుకోళ్లు, లక్ష్మీదేవర, ఊయల కట్టడం, కోళ్లు, మేకల బలి.. ఇలా తీరొక్క మొక్కులతో తల్లులను ప్రసన్నం చేసుకుంటున్నారు. పిల్లాపాపలను.. గొడ్డూగోదను.. ఎవుసాన్ని సల్లంగ సూడాలని మనసారా మొక్కుకుంటున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి.. కనిపించిన ప్రతి చెట్టు, పుట్టలో తల్లులను చూసుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తూ ఆధ్యాత్మిక భావాన్ని ఇనుమడింపజేస్తున్నారు.
అమ్మవార్ల ధ్యానంలో పూనకాలతో శివాలూగుతూ ఆడబిడ్డలు సమక్క-సారలమ్మలకు ప్రతిరూపాలుగా మారుతున్నారు. గుండెల నిండా భక్తితో తల్లీబిడ్డలకు ప్రణమిల్లి.. మళ్లొచ్చే జాతరకు మళ్లీవస్తామంటూ ఆనందంగా రుగుపయనమవుతున్నారు. భక్తులు వచ్చినప్పటి నుంచి క్షేమంగా వెళ్లేదాకా ఇటు పోలీసులు, అటు అధికారులు విధుల్లో తలమునకలై ప్రజాసేవలో తరిస్తున్నారు.
నేనూ స్నానం చేశానోచ్!
వాజేడు : మేడారం వనదేవతలను దర్శించుకోవడానికి చాలా మంది కుటుంబ సమేతంగా వచ్చారు. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను కూడా తీసుకొచ్చి ఇలా జంపన్నవాగులో బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానం చేయిస్తూ కనిపించగా ‘నమస్తే’ క్లిక్మనిపించింది.
కంకవనంలో కళాజాత..
ఏటూరునాగారం : కోట్లాది మంది భక్తులకు వేదికైన మేడారంలో కళాజాత ప్రదర్శనలతో అవగాహన కల్పిస్తున్నారు. వెట్టిచాకిరి విముక్తి, ఇతర సామాజిక రుగ్మతలపై కళాజాత బృందం నిర్వాహకుడు కిరణ్కుమార్ ఆధ్వర్యంలో సుమారు 10 మంది కళాకారులు వివిధ రూపాల్లో ప్రదర్శనలు ఇస్తూ ప్రజలను జాగృత పరుస్తున్నారు. అవసరమైన కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. రెండు రోజులుగా కళాజాత ప్రదర్శనలతో ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు కిరణ్కుమార్ తెలిపారు.
ఎస్సైలకు డీఎస్పీల సూచనలు..భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
మంగపేట : జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, విజయ్కుమార్, వెంకటేశ్బాబు, సురేశ్ పోలీస్ అధికారులు, ఇతర సిబ్బందికి సూచించారు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వద్ద 56మంది ప్రొబేషనరీ ఎస్సైలు, ఇతర సిబ్బందికి వారు సూచనలు చేశారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల మీదకు రాకతో భక్తుల రద్దీ పెరుగుతుందని, దర్శనానికి వచ్చే, వెళ్లే వారికి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు చెప్పాలన్నారు. తిరిగి వెళ్తున్న భక్తులను క్యూలైన్ల వారీగా విభజించాలని చెప్పారు.
అంతా మంచే జరుగుతదా?
ములుగు రూరల్, ఫిబ్రవరి 22 : సమ్మక్క, సారలమ్మ మీద భారం వేసి మేడారం వచ్చిన. నా రాత ఎలా ఉంది? నాకు అంతా మంచే జరుగుతదా? అంటూ ఓ వృద్ధురాలు జాతరలో కోయ దొరల వద్ద జాతకం చెప్పించుకుంటూ కనిపించింది.
క్లాత్ సంచులనే వాడుదాం..
గోవిందరావుపేట, ఫిబ్రవరి 22: మేడారంలో కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాల్ను జాతర నోడల్ ఆఫీసర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్ గురువారం ప్రారంభించారు. క్లాత్ సంచులను ఆవిష్కరించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం జాతరలో భక్తులు పాలిథిన్ కవర్లు కాకుండా బట్టసంచులనే వాడాలని సూచించారు.