పాలకుర్తి రూరల్, నవంబర్ 25 : కాంగ్రెస్కు ఓటు వేస్తే కటిక చీకట్లు, కరెంట్ కోతలు ఖాయమని, కాంగ్రెస్తో రిస్క్ వద్దు.. కారు ముద్దు అని, పాలకుర్తి ప్రజలు, ఓటర్లు ఆలోచించి ఓట్లు వేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రాజీవ్చౌరస్తాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గెలుపు కోరుతూ నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభ, రోడ్డు షోకు మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే నిండా మోసపోతామని ప్రజలను, రైతులను హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్రంలో నమ్మి ఓట్లువేస్తే పెనం మీది నుంచి పొయ్యిల పడ్డట్లు తయారైందన్నారు. అక్కడ 9గంటల కరెంట్ పోయి 5గంటల కరెంట్ వస్తోందని మండిపడ్డారు. విద్యార్థులకు స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయాయన్నారు. పెన్షన్ల ఖజానాకు గండిపడిందని చెప్పారు. రైతు బంధుకు రాంరాం చెప్పారన్నారు. గ్యారెంటీలు పోయి వారెంటీలు వచ్చాయన్నారు. యువశక్తికి దిక్కులేదన్నారు. ప్రియాంక్గాంధీ పత్తా లేదు..రాహుల్ జాడ లేడని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి కరెంట్పై సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. రైతాంగానికి మూడు గంటల కరెంట్ ఇస్తాననడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు.
10హెచ్పీ మోటర్లతో వ్యవసాయం చేయడం సాధ్యమా..? అని ప్రశ్నించారు. రైతులను ఆగం చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు.కాంగ్రెస్ పాలనలో దొంగరాత్రి కరెంట్ వచ్చిందన్నారు. 24గంటల కరెంట్ కావాలంటే కారు గుర్తుకు దయన్నకు ఓటు వేయాలని కోరారు. రైతు బంధు ఎకరం ఉన్నా రూ.15వేలే, 10ఎకరాలు ఉన్నా రూ.15వేలే ఏడాదికిఇస్తామని రైతులను కాంగ్రెస్ నాయకులు మోసం చేయాలని చూస్తున్నారన్నారు. అదే సీఎం కేసీఆర్ రైతు బంధు ఎకరం ఉన్నా రూ.16వేలు, 10ఎకరాలు ఉంటే లక్ష 60వేల రూపాయలు ఇస్తామన్నారు. రైతులు కాంగ్రెస్ మోసాన్ని గమనించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా రైతు బంధు డబ్బుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ధర్మం వైపే దేవుడు నిలబడ్డాడన్నారు. సోమవారం నుంచి రైతు బంధు డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. రైతులను బిచ్చగాల్లు చిల్లర గాల్లు అన్న రేవంత్రెడ్డిని రైతులు ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ కూడా 75శాతం చేశామన్నారు. మరో 25శాతం ఎన్నికల కమిషన్ ఆమోదం తీసుకుని వేస్తామన్నారు. ఉత్తర ప్రదేశ్లో మూడు స్థానాలు గెలిపించలేని ప్రియాంకగాంధీ తెలంగాణలో 30స్థానాలు గెలిపిస్తుందట అని ఎద్దేవా చేశారు.
యూపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా..? అని ప్రశ్నించారు. రాహుల్ ఎక్కడా కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేప్టీల నాయకులు ఢిల్లీ గులాంలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలే సీఎం కేసీఆర్కు హై కమాండ్ అన్నారు. కాంగ్రెస్ నమ్మితే అన్ని పథకాలు బంద్ అవుతాయన్నారు. అందుకే రిస్క్ వద్దు.. కారు ముద్దు అని హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తం డాలు ప్రత్యేక జీపీలుగా ఆవిర్భవించాయన్నారు. సీఎం కేసీఆర్ మూడో సారి సీఎం కాగానే గిరిజన బంధు అమలు చేస్తామన్నారు. దళితులకు దళిత బంధు ఇస్తామన్నారు. ఇంటి ముందు అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని సూచించారు. పాలకుర్తిలో ఆత్మగౌరవానికి నోట్ల కట్టలకు మధ్య పోటీ అన్నారు. ఇంటి పార్టీ బీఆర్ఎస్కే పట్టం కడుతారన్నారు. మంత్రి దయాకర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్రావు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు, రాష్ట్ర నాయకులు బక్క నాగరాజు, గాంధీనాయక్ పాల్గొన్నారు.