Russia War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యాకు భారీ నష్టం జరిగింది. ఈ యుద్ధం మొదలైన తర్వాత ఒకేసారి అత్యధిక ప్రాణ నష్టం సంభవించింది. రష్యాపై తాజాగా ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఏకంగా 12 మంది మరణించారు. మరో 39 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ రష్యా, టాటార్స్తాన్ పరిధిలోని నినేకామ్స్క్ పట్టణంపై ఉక్రెయిన్ డ్రోన్తో దాడి చేసింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. నినేకామ్స్క్ పట్టణం ఉక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 1,000 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉంటుంది.
అంతదూరంలో ఉన్న పట్టణంపై ఉక్రెయిన్ దాడి చేయడం గమనార్హం. ఈ పట్టణం అధిక సహజ, చమురు వనరులు కలిగి ఉంది. అనేక సంఖ్యలో చమురు రిఫైనరీలు ఉన్నాయి. ఈ దాడికి సంబంధించి పలు వీడియోలు కూడా అక్కడి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక పారిశ్రామిక ప్రాంతంలో పేలుడు జరిగి, భారీగా పొగ వెలువడుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ దాడికి బదులుగా రష్యా కూడా ప్రతిదాడికి దిగింది. ఉక్రెయిన్ ఖార్ఖివ్ ప్రాంతంపై రష్యా జరిపిన దాడిలో నలుగురు పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. చుగివ్ జిల్లాలోని, బుగైవిక గ్రామంపై సోమవారం రష్యా జరిపిన దాడిలో భారీ ప్రాణనష్టం జరిగిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్కు చెందిన 456 డ్రోన్లను రాత్రిపూట తాము కూల్చివేశామని రష్యా అధికారులు వెల్లడించారు. రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడికి దిగిందన్నారు. మరణించిన వారిలో ఒక మహిళ కూడా ఉందని తెలిపారు. నాలుగేళ్లుగా ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇరుదేశాలకు చెందిన సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.