వేలేరు, నవంబర్ 5 : బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ మాటే శిరోధార్యంగా ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని, ఆ వర్గం, ఈ వర్గమంటూ ఏమి లేదని మనమంతా ఒక్కటే సీఎం కేసీఆర్ వర్గమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం మండలంలోని సోడాషపల్లిలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశాన్ని బీఆర్ఎస్ వేలేరు మండలాధ్యక్షుడు ఎం నర్సింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ అసత్యాలు, అబద్ధాలు మాత్రమే ప్రతిపక్షాల ఆయుధాలని, అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఆయుధాలన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు. ఐక్యంగా ముందుకు వెళ్తేనే పార్టీకి, కార్యకర్తలకు మనుగడ ఉంటుందన్నారు. పార్టీ లైన్ ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాల అమలును ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. అలాగే ఎన్నికల మ్యానిఫెస్టోలు ప్రకటించిన పథకాలను కూడా పూర్తిగా అర్థమయ్యేలా వివరించాలన్నారు. ప్రతి గ్రామంలోని బూత్లో వచ్చే మెజార్టీయే ప్రాతిపాదికన వచ్చే రోజుల్లో ఆశావహులకు పదవులు దక్కుతాయన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదో ప్రజలకు వివరించాలన్నారు.
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే రా జయ్య మాట్లాడుతూ జనగామ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా, స్టేషన్ఘన్పూర్గా శాసనసభ్యడిగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత తనపై ఉందన్నారు. భేషజాలు లేకుండా పార్టీ కోసం పని చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గ్రూపు రాజకీయాలు, వర్గాలతో పార్టీకి నష్టం వచ్చే అవకాశముందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపు కోసం తనవంతు కృషి, పూర్తి సహకారం అందిస్తానన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ తనకు వ్యక్తిగత ఎజెండాలు లేవని, నియోజకవర్గ అభివృద్ధే నా ఎజెండా అన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది ఘన్పూర్ నియోజకవర్గమేనని, ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. ఈ ప్రాంత నాయకులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య సహకారంతో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత అభివృద్ధిలో ఘన్పూర్ నియోజకవర్గాన్ని నిలిపేందుకు పాటుపడుతానన్నారు. వందకు వంద శాతం మూడోసారి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. కేసీఆరే సీఎం కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. 55 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు చేస్తామని వస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని తెలిపారు. వారి మాటలు నమ్మి ఓటు వేస్తే ఆగమైపోతామన్నారు. అందరం కలిసి పని చేద్దాం ఘన్పూర్ గడ్డపై గులాబీ జెండాను మరోసారి ఎగురవేద్దామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు, గృ హలక్ష్మీ పథకాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏనుగు రాకేశ్ రెడ్డి, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఘన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కార్పొరేటర్ ఏ రాధికరెడ్డి, అన్ని మండలాల పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతుబంధు స మితి సభ్యు లు, పీఏసీఎస్ చైర్మ న్లు, డైరెక్టర్లు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.