రైతులకు మూడు గంటల కరంటు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూడో రోజూ నిరసనలు పెల్లుబికాయి. ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లు ధర్నాలతో గురువారం దద్దరిల్లాయి. బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కలిసి ఆందోళన కర్యక్రమాలను ఉధృతంగా కొనసాగించారు. రేవంత్ దిష్టిబొమ్మలకు పలు చోట్ల ఉరేసి, శవయాత్రలు తీసి, చెప్పులతో కొట్టి కూడళ్లలో దహనం చేశారు. సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత కరంటు ఇస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చితే ఓర్వలేని రేవంత్రెడ్డి, సాగును నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడని, కాంగ్రెస్కు మళ్లీ అవకాశం ఇస్తే తిరిగి పాత రోజులే వస్తాయని మండిపడ్డారు. వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్లో జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేటలోని వల్లభ్నగర్ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రేవంత్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలను ఖండించారు. రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 13
నమస్తే నెట్వర్క్, జూలై 13: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు.. మూడు గంటలు ఇస్తే చాలు.. అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం పెద్దఎత్తున నిరసనలతో హోరెత్తించారు. విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. టీపీసీసీ చీఫ్ దిష్టిబొమ్మలకు ఉరి వేసి దహనం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించగా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొని పాడె మోశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్డులోని 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ బిందు పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసముద్రం మండలం కల్వల గ్రామంలోని సబ్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను చెట్టుకు ఉరి తీశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట చౌరస్తా వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. అనంతరం పీసీసీ చీఫ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నర్సంపేటలోని వల్లభ్నగర్ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హాజరై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రైతులకు రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పితీరాల్సిందేనని డిమాండ్ చేశారు.