ములుగు, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ప్లాట్లు కొనేవారు లేక ములుగు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ములుగు జిల్లాగా ఏర్పడిన తర్వాత చుట్ట పక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగింది. కానీ, మూడు నెలల కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ములుగు జిల్లా కేంద్రంతో పాటు మల్లంపల్లి, జంగాలపల్లి గ్రామాలతో పాటు వెంకటాపూర్ మరికొన్ని మేజర్ గ్రామపంచాయతీల్లో రియల్ జోరు నడిచింది. భూములు కొనేవారు తక్కువ కావడంతో పెద్ద ఎత్తున వెలుస్తున్న వెంచర్లలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్లాట్లకు సరైన ధర లభించకపోవడంతో స్థిరాస్తి వ్యాపారం మందగించింది. గ్రామ పంచాయతీగా ఉన్న ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. పంచాయతీ పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగిసిన వెంటనే మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని బిల్లును పాస్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మున్సిపాలిటీ కళ ఎప్పుడు నెరవేరుతుందోననే అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. దీంతో కొనుగోలు చేసిన వెంచర్లలో ప్లాట్లకు రేట్లు పెరుగకపోవడం, గతంలో కొన్న వారికి సరైన రేట్లు రాకపోవడంతో బిజినెస్ మొత్తం డీలా పడింది. ములుగు జిల్లా కేంద్రంలో ఎక్కడ వెంచర్ చేసినా రోజుల వ్యవధిలోనే ప్లాట్లు అమ్ముడుపోయేవి.
నేడు భూములను కొనే వారు లేక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తగిన లాభాలు రాకపోవడంతో నూతన వెంచర్లు ఏర్పాటు చేయడంలేదు. గ్రామ పంచాయతీగా ఉన్న ములుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే మున్సిపాలిటీ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. దీంతో వ్యాపారులకు కూడా పెట్టుబడులు పెరుగడంతో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి తగ్గింపు ధరల్లో ప్లాట్లు విక్రయించలేని పరిస్థితి ఉంది. అక్కడక్కడ వెంచర్లు చేస్తున్నా కొనుగోలు చేసే వారు లేక పెట్టుబడి పెట్టిన రియల్టర్లు ఆందోళన చెందుతున్నారు. కొందరు పెట్టిన పెట్టుబడి వచ్చినా సరిపోతుందనే ఉద్దేశంతో విక్రయాలు జరుపుతుండగా, మరికొందరు సరైన లాభాలు రావడం లేదని అలాగే ఉంచుకుంటున్నారు. వ్యాపారం తగ్గడంతో పాటు కొత్తగా భూములు కొనుగోలు చేసే వారు లేక పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేక వ్యాపారులు విలవిలలాడుతున్నారు. చేసేది ఏమీలేక దళారులకు కమీషన్లు ఇచ్చి తక్కువ ధరలకే ప్లాట్లను విక్రయిస్తున్నారు. అయినప్పటికీ కొనే వారు లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం దివాళా తీసే స్థాయికి చేరింది. మున్సిపాలిటీ ఏర్పాటు చేసినట్లయితే భూముల రేట్లు మరింత పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభాల బాట పట్టేదని పలువురు వ్యాపారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.