వరంగల్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యాన్ని 2లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యంగా ఇందుకు 199 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో రైతుల నుంచి వానకాలం ధాన్యం, పత్తి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ పీ ప్రావీణ్య శనివారం కలెక్టరేట్లో అధికారులు, రైస్మిల్లర్స్, కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానకాలం ధాన్యం దిగుబడి వస్తుందని, 50లక్షల గన్నీ సంచులు అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 2,715 టార్ఫాలిన్లు, 177 ప్యాడీ క్లీనర్లు, 189 తేమ కొలిచే యంత్రాలు, 364 ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. కాగా, పత్తి కొనుగోలుపై సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ పత్తి రైతులకు కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.7,020 కల్పించినట్లు చెప్పారు. రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేందుకు నాణ్యత ప్రమాణాలను పాటించాలని, ఆధార్ అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాకు మాత్రమే డబ్బు జమచేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాల్, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్, మార్కెటింగ్శాఖ జిల్లా అధికారి ప్రసాదరావు, డీఆర్డీవో సంపత్రావు, ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్, లీగల్ మెట్రాలజీ అధికారి ప్రవీణ్కుమార్, జిలా సహకార అధికారి బీ సంజీవరెడ్డి, ఎఫ్సీఐ మేనేజర్ సతీశ్కుమార్ తదతరులు పాల్గొన్నారు.