జిల్లాలో వరుసగా నాలుగేండ్లలో 57 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఈ ఏడాది 9,231 ఎకరాల్లో సాగు చేసేందుకు నిర్ణయించింది. వచ్చే జూలై నుంచి దశలవారీగా రైతులకు మొక్కలను అందజేసే దిశగా ఉద్యాన శాఖ ముందుకు వెళ్తున్నది. ఆయిల్పామ్ సాగుకు ఆసక్తి కనబరుస్తున్న రైతులు మొక్కల కోసం రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం మీ-సేవ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు పంపుతున్నారు. ఇప్పటికే సంగెం మండలంలోని లోహిత గ్రామంలోని కంపెనీ నర్సరీలో 6లక్షల మొక్కలను పెంచుతున్నారు. జూలైలో 800, ఆగస్టులో 800, సెప్టెంబర్లో 800, నవంబర్లో 1,430, జనవరిలో 2,200, మార్చిలో 3 వేలకుపైగా ఎకరాల్లో సాగుకు అవసరమైన ఆయిల్పామ్ మొక్కలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వరంగల్, ఏప్రిల్ 28(నమస్తేతెలంగాణ) : రైతులను పంట మార్పిడికి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని కోరుతున్నది. ఈ క్రమంలో లాభదాయకమైన ఆయిల్పామ్ సాగు చేయాలని సూచిస్తున్నది. సాగు చేసే వారికి పంట పెట్టుబడిలో సబ్సిడీలనూ అందజేయనున్నట్లు ప్రకటించింది. మొక్కల సరఫరా కోసం నర్సరీ నిర్వహణ, రైతుల నుంచి ఆయిల్పామ్ దిగుబడులను కొనుగోలు చేసేందుకు జిల్లాకో కంపెనీని ఎంపిక చేసింది. వరంగల్ జిల్లాను రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్కు కేటాయించింది. ఈ కంపెనీ సంగెం మండలంలోని లోహిత గ్రామం వద్ద ఆయిల్పామ్ మొక్కల పెంపకం కోసం నర్సరీ ఏర్పాటు చేసింది. గత సెప్టెంబర్ నుంచి ఈ కంపెనీ విడుతల వారీగా కోస్టారిక, మలేషియా దేశాల నుంచి ఆయిల్పామ్ మొక్కలను దిగుమతి చేసుకుంటున్నది. ఒక్కో ఎకరంలో నాటేందుకు 57 ఆయిల్పామ్ మొక్కలు అవసరం. దీంతో ఇప్పటికే రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆరు లక్షల మొక్కలను దిగుమతి చేసుకున్నది. ప్రస్తుతం ఈ మొక్కలు లోహితలోని కంపెనీ నర్సరీలో పెరుగుతున్నాయి. లభ్యతను బట్టి వచ్చే జూలై నెల నుంచి రైతులకు మొక్కలను అందజేయాలని ఉద్యానశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు ఆసక్తితో ఉన్న రైతుల్లో సుమారు 1,100 మందిని ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లి సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. మండల స్థాయిలోనూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు 57 వేల ఎకరాల విస్తీర్ణం అనువైనదిగా అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఏటా కొన్ని వేల ఎకరాల చొప్పున వరుసగా నాలుగేళ్లలో ఆయిల్పామ్ సాగుకు ఉద్యానశాఖ ప్రణాళిక రూపొందించింది. సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులకు 2022-23 సంవత్సరం నుంచి మొక్కలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే జూలై నెల నుంచి పంపిణీ చేయడం ప్రారంభించాలని కూడా స్పష్టం చేసింది. దీంతో మొదటి సంవత్సరం 9,231 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు అవసరమైన మొక్కలను రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ నర్సరీ నుంచి రైతులకు అందజేసేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో రైతులు లోహితలోని రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 12 వేలకుపైగా ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు అందినట్లు ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు సీరియల్ ప్రకారం అందజేస్తామని తెలిపారు. మార్చి వరకు మొక్కల పంపిణీ పూర్తి కానుందని చెప్పారు. 2023-24 సంవత్సరం జిల్లాలో 12 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ఉద్యానశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
– శ్రీనివాసరావు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి, వరంగల్
ఈ ఏడాది 9,231 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసే రైతులు మీ-సేవ కేంద్రాల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆయిల్పామ్తో పాటు అంతర పంటల సాగుకూ ప్రభుత్వం దశల వారీగా డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేయనుంది. ఈ రెండింటికీ కలిపి దరఖాస్తు చేసుకున్నా డ్రిప్ ఇరిగేషన్ సాంక్షన్ చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. ఇది కూడా ముందుగా దరఖాస్తు చేసిన రైతులకు మొదట అందనుంది. రైతుల ఇష్ట ప్రకారం వారు కోరిన కంపెనీ డ్రిప్ ఇరిగేషన్ను అందిస్తాం. మొక్కల పంపిణీకి ముందు కూడా మండల స్థాయిలో రైతులకు మరోసారి మొక్కలు నాటడం, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తాం.