వరంగల్, ఆగస్టు 15 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విదేశీ పాలన నుంచి విముక్తి కోసం జరిగిన స్వాతంత్య్ర పోరాటానికి ఊపిరిలూదిన మహనీయులను ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్ల క్రితం కొత్తగా ఏర్పాటైన హనుమకొండ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. సువిశాల స్థలంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల భవనం జిల్లా కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలుస్తుందన్నారు. రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో రైతు బంధు ద్వారా రైతులను ఆదుకుంటున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎకరానికి 5 వేల చొప్పున 1,39.203 మంది రైతులకు రూ. 113.93 కోట్లు పంట పెట్టుబడి కింద అందించారన్నారు.
2022-23 సంవత్సరానికి గాను రైతు బీమా ద్వారా 307 మంది రైతులకు రూ.15.35 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. రూ. 6.20 కోట్లు రైతులకు పంట నష్ట పరిహారం అందించిందదన్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. జిల్లాలో 150 ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 13 లక్షల 9వేల 350 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 31,830 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. రూ. 168.96 కోట్లు రైతులకు ఆన్లైన్ ద్వారా చెల్లించామన్నారు. కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి 6 వేల మంది భవన నిర్మాణ కార్మికులకు సభ్యత్వం కల్పించామన్నారు. 433 మంది కార్మికులకు వివిధ పథకాల ద్వారా రూ. 3 కోట్లు అందించడం జరిగిందన్నారు. కార్మికుల కోసం ప్రత్యేకంగా కార్మిక మాసోత్సవాలను నిర్వహించామన్నారు. రాష్ట్రం క్రీడల వేదికగా నిలుస్తున్నదన్నారు. జేఎన్ఎస్ స్టేడియంలో 400 మీటర్లు పొడవులో 8 లైన్ల సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేశామన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో 204 క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. పల్లె ప్రగతి ద్వారా జిల్లాలో నగరాలు, పట్టణాలు, పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతి ద్వారా 208 డంపింగ్ యార్డులు, 208 శ్మశాన వాటికలు, 234 పల్లె ప్రకృతి వనాలు నిర్మించామన్నారు. పట్టణ ప్రగతి ద్వా రా 15 ఆర్థిక సంఘం నిధులతో రూ. 259 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సీఎం హామీ నిధులు రూ. 255 కోట్లతో 967 అభివృద్ధి పనుల్లో 424 పనులు పూర్తయ్యాయన్నారు.
మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు విదేశీ చదువుల కోసం ఒకొక్కరికి రూ. 20 లక్షల చొప్పున 17 మంది విద్యార్థులకు అందచేశామన్నారు. కుల వృత్తుల వారికి బీసీ సంక్షేమ శాఖ నుంచి 444 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. కుడా అధ్వర్యంలో 2014 నుంచి 2023 వరకు రూ. 280 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ. 30 కోట్లతో భద్రకాళీ అలయం చుట్టూ మాడవీధులు, రూ.74.50 కోట్లతో వరంగల్ బస్ స్టేషన్, రూ. 50 కోట్లతో నాయుడు పంప్ నుంచి ఎనుమాముల మార్కెట్ వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. రూ. 70 కోట్లతో నగర నడిబోడ్డున కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నామని, పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ఇప్పటకే ఓసిటీ, మా సిటీ పేరిట చేపట్టిన వెంచర్లు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఉనికిచర్లలో 135 ఎకరాల్లో యుని సిటీ పేరిట లే అవుట్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లాలో 4,480 డబుల్ బెడ్రూం గృహాలు మంజూరు అయ్యయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మిగతా డబుల్ బెడ్రూం గృహాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో గృహలక్ష్మి పథకానికి 8,400 గృహాలు కేటాయించారన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. అర్హులైన జర్నలిస్ట్కు ప్రభుత్వం ఇండ్ల స్థలాల మంజూరు ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు.
పేద దళిత కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే బృహత్తర పథకం దళితబంధు అని ఆయన అభివర్ణించారు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు దళిత బంధు పథకం ద్వారా అందజేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,182 మంది లబ్ధిదారులకు రూ.414 కోట్లు అందజేశామన్నారు. దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రెండో విడుత కంటి వెలుగు జిల్లాలో విజయవంతం అయ్యిందన్నారు. రూ. 2.40 కోట్లతో టీ డయాగ్నస్టిక్ ఏర్పాటు చేసి పేదలకు 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖా నాల్లో ప్రసవాలు పెరిగాయని, 2023 ఏప్రిల్ నుంచి జూలై వరకు 2,025 ప్రసవాలు జరిగాయన్నారు. 1740 కేసీఆర్ కిట్లను అందించామన్నారు. ఇది ప్రభు త్వ వైద్యంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. అనంతరం పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో పోలీస్ పరేడ్ వీక్షించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను శాలువాలతో సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందిస్తున్న ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ ప్రశంసాపత్రాలను అందజేశారు. 262 మంది ఉద్యోగులతో పాటు సామాజిక రంగంలో సేవలందిస్తున్న 21 మందికి ప్రసంసాపత్రాలను అం దజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండు సుధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, ఆదనపు కలెక్టర్ మహేందర్జీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.