Tarun Tejpal | ముంబై: తరుణ్ తేజ్పాల్కు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5 లక్షల జరిమానాను విధిస్తూ బాంబే (Bombay) హైకోర్టు తీర్పు వెలువరించింది. తేజ్పాల్ తనపై రేప్ చేశాడని తెహెల్కా (Tehelka) ఉద్యోగిని 2013లో కేసు పెట్టింది. దీనిపై విచారణ చేపట్టగా బాంబే హైకోర్టులోని గోవా ట్రయల్ కోర్టు 2021లో నిర్దోషిగా తీర్పు వెలువరించింది. దీనిపై గోవా ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. విచారణ అనంతరం నేడు 10 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది బాంబే హైకోర్టు. అంతేకాకుండా రెండు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆర్డర్ వేసింది.
జస్టిస్ (Justice) నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్సాందేకర్లతో కూడిన ధర్మాసనం సెక్షన్ 376(2)(f), 376(2)(k)తో పాటు సెక్షన్ 354A అండ్ 354B కింద అత్యాచారం, లైంగిక వేధింపుల నేరాలకు సంబంధించి తేజ్పాల్ను దోషిగా తేల్చింది.
మూడు రోజుల పాటు జరిగిన తుది వాదనల విచారణ రెండు అంశాలను వెల్లడిస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. అవి.. తేజ్పాల్ను నిర్దోషిగా అని తేల్చడంలో ట్రయల్ కోర్టు పొరపాటు చేసిందా, ఫిర్యాదు చేసిన బాధితురాలికి క్షమాపణ కోరుతూ ఈ-మెయిల్ చేయడం లైంగిక దాడి చేశారని అంగీకరించినట్లేనా అని. విచారణ సందర్భంగా రికార్డులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించకుండా కేసు సంఘటన తరువాతి ప్రవర్తన, నేపథ్యాన్ని ట్రయల్ కోర్టు అంచనా వేసిందని చెప్పారు.
తీర్పు వెలువడే సమయంలో తేజ్పాల్ తన వయసు 62 అని, తనకు భార్య ఉంది. తనపై ఉదారత చూపాలని అభ్యర్థించారు. తేజ్పాల్ కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఆబాద్ పోండా ఈ కేసు సుప్రీంకోర్టులో అప్పీలుకు దాఖలు చేసేందుకు వీలుగా ఈ ఉత్తర్వులను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టును అభ్యర్థించారు. అయితే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందిస్తూ బాధితురాలికి అతడు తండ్రిలాంటివాడు అని, కూతురు వయసున్న అమ్మాయిపై నేరానికి పాల్పడ్డాడు. అతడు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండకూదు. దీనిపై సమాజానికి సందేశం ఇవ్వాలనే ఈ తీర్పు ఇచ్చాం అని తుషార్ మెహతా అన్నారు.