హనుమకొండ, డిసెంబర్ 8 : పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్యే ఉంటానని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. 2005లో ఉద్యమ నేత కేసిఆర్, కేటీఆర్, హరీశ్రావు, అప్పటి పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్కుమార్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరానన్నారు. అధిష్టానం కార్పొరేటర్గా పోటీ చేయమని ఆదేశిస్తే 37వ డివిజన్ నుంచి పోటీ చేసి గెలిచానని, నగర అధ్యక్షుడిగా పని చేశానన్నారు. 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. ఉద్యమంలో రాస్తారోకోలు, ధర్నాలు చేశానన్నారు. ఉద్యమకారులకు ఆర్థికసాయం అందించానని తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి గెలుపొందానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయించానని తెలిపారు. 2014, 2018లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారన్నారు. ప్రభుత్వం ఉన్నత పదవులు ఇచ్చినప్పటికీ ప్రజల మధ్యలో ఉన్నానని చెప్పారు. గుడిసె వాసుల కోసం వామపక్షాలతో కలిసి పోరాడానని తెలిపారు. పశ్చిమ ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించానన్నారు.
నగరాభివృద్ధి కోసం నిస్వార్థం, నిజాయితీ, నిబద్ధతతో పనిచేశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక, పశ్చిమ నియోజకవర్గంలో గెలిచిన నాయిని రాజేందర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ విభాగాల నుంచి పెద్ద మొత్తంలో నిధులను తీసుకువచ్చానని తెలిపారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధిని వరంగల్ పశ్చిమలో చేశానన్నారు. కొందరు పథకాల అమలులో దుష్ప్రచారం చేశారని, ఎవరితోనూ కక్షపూరితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ఓటమిపై విశ్లేషించుకొని ముందుకు సాగుతామని తెలిపారు. పార్టీ పటిష్టతకు పాటుపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు పశ్చిమలో కొన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, ఇంకా పూర్తికాని పనులు పూర్తి చేయాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు చెన్నం మధు, వేముల శ్రీనివాస్, బోయినపల్లి రంజిత్రావు, నలబోల సతీశ్, పులి రజినీకాంత్, నెక్కొండ కిషన్, పరశురాములు, సుగుణాకర్రెడ్డి పాల్గొన్నారు.
హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాటి నుంచి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశానని దాస్యం అన్నారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల పాటు ప్రజలకు సేవ చేసిన తర్వాత ఓటమి ఎదురవడం జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన తపన అంతా గులాబీ కుటుంబ సభ్యుల గురించేనన్నారు. పార్టీ ఆశీర్వదించి అవకాశం కల్పిస్తే 2009, 2010, 2014, 2018లో గెలిచానని, ఈ సారి ఎకడ లోపం జరిగిందో ఆత్మ విమర్శ చేసుకుందామని సూచించారు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని భావిస్తున్నానని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సరిగ్గా తిప్పికొట్టలేదని, అది కూడా ఓటమికి ఒక కారణం అని ఆయన పేర్కొన్నారు. ఏనాడూ హంగు ఆర్భాటాలకు పోలేదని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశానని తెలిపారు.
వ్యక్తిగత పదవులు అడగలేదని, కాంట్రాక్టులు తీసుకోలేదని అన్నారు. పేదలకు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేశానని, గుడిసె వాసుల కోసం 2009 నుంచి ఇప్పటివరకు అనేక ప్రభుత్వ స్థలాల్లో సైతం పట్టాలు ఇప్పించానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నాన్య తండాలో గుడిసెలను తొలగించాలని చూసినపుడు వారికి అండగా నిలిచి పోరాటం చేసి పట్టాలు ఇప్పించానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే గుడిసె వాసులను, కుట్టు మిషన్ నిర్వహణ సంస్థలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అధికారపక్షం కక్షపూరిత చర్యలు చేపడుతోందన్నారు. కార్పొరేటర్లు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. పార్టీ అధ్యక్షులు అస్వస్థతకు గురయ్యారని, ప్రతి కార్యకర్త వారి క్షేమాన్ని ఆశిద్దాం అని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.