హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): హైడ్రా ఫేక్ ఎన్వోసీల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఫైర్ ఎన్వోసీల కోసం పలు కళాశాలల యాజమాన్యాలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్లతో ఇంటర్మీడియట్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవడంలో కీలక సూత్రధారులు ఎవరన్నది ఇప్పటికీ తేలలేదు. దీంతో అసలు సూత్రధారులు ఎవరు? శిక్ష ఎవరికి పడుతుందని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారంపై ఇటీవల ఓ కళాశాల యజమాని హైడ్రా ఉన్నతాధికారిని కలువడంతో కాలేజీల యాజమాన్యాలను వెనకేసుకొచ్చినట్టు సమాచారం.
‘ఈ దందా గురించి కళాశాల యాజమాన్యాలకు ఏం తెలుస్తుంది? వారి కింద ఉన్న గుమస్తాలెవరో కేటుగాళ్లను నమ్మి మోసపోయి ఉంటారు’ అని ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యానిస్తూ.. ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసిన అసలు సూత్రధారులెవరో తేల్చాలని అక్కడే ఉన్న ముగ్గురు అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఆ అధికారులు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసినవారిని కనుక్కోకుండా ఆ సర్టిఫికెట్లు తీసుకున్నవారిని టార్గెట్ చేయడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై హైడ్రా ఈ నెల 4న లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత గానీ, అంతకుముందు గానీ అధికారులు ఎందుకు లోతుగా పరిశీలన జరుపలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఇచ్చిన సర్టిఫికెట్లపై కూడా హైడ్రానే ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఒక్కో సర్టిఫికెట్కు రూ.6 లక్షలు
కాలేజీలు, దవాఖానలు, వాణిజ్య సముదాయాలకు నిరభ్యంతర పత్రాలు జారీచేయాలంటే ఆ భవనాలు, వాటిలోని సదుపాయాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ, అవేమీ సరిగా లేకపోవడం వల్లే పలు కళాశాలల యజమానులు ఎన్వోసీల కోసం దొడ్డిదారిన ప్రయత్నించినట్టు సమాచారం. దీంతో కొందరు వ్యక్తులు హైడ్రాలోని ఇద్దరు అధికారులతో కలిసి ఈ దందాకు తెరలేపారని, ఒక్కో నకిలీ సర్టిఫికెట్ జారీకి రూ.6 లక్షల చొప్పున పుచ్చుకున్నారని తెలిసింది. ఈ వ్యవహారమంతా హైడ్రా కార్యాలయంలోనే జరిగిందని, ఎన్వోసీల కోసం అక్కడికి వచ్చిన దరఖాస్తుదారుల వివరాలను మధ్యవర్తుల ద్వారా హైడ్రా అధికారులకు పంపి, మళ్లీ ఆ మధ్యవర్తులే సర్టిఫికెట్లు తెచ్చి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని వినికిడి. హైడ్రా సిబ్బంది సహకారం లేకుండా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం, సంబంధిత స్టాంపులతో నకిలీ ఎన్వోసీలు తయారు చేయడం అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి.
ఇతర భవనాలకూ ఫేక్ సర్టిఫికెట్లు?
ఈ దందా కేవలం కళాశాలలకే పరిమి తం కాలేదని, పలు ప్రైవేట్ దవాఖానలు, కమర్షియల్ కాంప్లెక్సులు, నాన్-హైరైజ్ బిల్డింగుల యజమానులు సైతం ఫేక్ సర్టిఫికెట్లతో ఎన్వోసీలు పొందారని ఆరోపణ లు వినిపిస్తున్నాయి. దీంతో అసలు హైడ్రా ద్వారా మొత్తం ఎన్ని ఎన్వోసీలు ఇచ్చారో, వాటిలో అసలైనవెన్నో, నకిలీవెన్నో తేల్చాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అస లు సూత్రధారులెవరో తేల్చకపోవడం ఏ మిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. హైడ్రా లో ఫేక్ ఎన్వోసీల వ్యవహారం వెలుగులో కి రావడంతో ఇకపై దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఆఫ్లైన్లో దరఖాస్తులను స్వీకరించడం వల్ల కొన్ని అక్రమాలు జరిగి ఉండవచ్చని కమిషనర్ రంగనాథ్ భావిస్తున్నారని, ఆగమేఘాల మీద ఆన్లైన్ ప్రక్రియను మొదలుపెట్టారని హైడ్రాలోని సీనియర్ అధికారి చెప్పారు.