ఏర్పాట్లు చేస్తున్న అధికారులుదళితబంధు పథకం అమలును అధికారులు వేగవంతం చేశారు. లబ్ధిదారులకు యూనిట్లను అందజేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం కొందరికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రారంభ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి విడుత ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో వంద మందికి అందజేయనున్నారు. ఒక్కొక్కరికి రూ.10లక్షల యూనిట్ను మంజూరు చేయగా, జిల్లాలో 303 మందికి రూ.30.30 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది.
– వరంగల్, ఏప్రిల్ 12(నమస్తేతెలంగాణ)
వరంగల్, ఏప్రిల్ 12(నమస్తేతెలంగాణ) : దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలో తొలి విడుత యూనిట్లు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ జాబితాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షల యూనిట్ను మంజూరు చేసింది. ఈ నిధులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. తొలివిడుత జిల్లాలో 303 మందికి రూ.30.30 కోట్ల విలువైన యూనిట్లను ఇవ్వనున్నది. చెన్నారావుపేట మండలం లింగగిరిలో 13మంది, దుగ్గొండి మండలం రేకంపల్లిలో 12మంది, ఖానాపురం మండలం బుధరావుపేటలో 12మంది, నల్లబెల్లి మండలం రామతీర్థంలో 12మంది, నర్సంపేట మండలం గురిజాలలో 14మంది, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 24మంది, నెక్కొండ మండలం తోపనపల్లిలో 13మంది, గీసుగొండ మండల కేంద్రంలో 15మంది, సంగెం మండల కేంద్రంలో 15మంది, రాయపర్తి మండలం కిష్టాపురంలో 20మంది, వర్దన్నపేట మండలం అంబేద్కర్నగర్లో 10మంది, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 14మంది, పర్వతగిరి మండలం అనంతారంలో 10మంది, ఖిలావరంగల్ మండలం మామునూరులో 9మంది, వరంగల్ మండలం కొత్తపేటలో 10 మందికి లబ్ధి చూకూరనుంది. వీరితో పాటు వరంగల్, ఖిలావరంగల్ మండలంలోని వివిధ డివిజన్లలో 100 మందికి యూనిట్లను మంజూరు చేసింది. 303 లబ్ధిదారుల పేర అధికారులు వ్యక్తిగత ఖాతాలను వివిధ బ్యాంకుల్లో తెరిచారు. కలెక్టర్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేసిన దళిత బంధు పథకం నిధులను కొద్దిరోజుల నుంచి ఈ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు
ఎంపికైన లబ్ధిదారులకు దళితబంధు పథకం అమలుపై అధికారులు నియోజకవర్గం, మండలం వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా యూనిట్ ఎంపికకు సంబంధించి సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితాను లబ్ధిదారులకు అందజేశారు. ఎక్కువగా లబ్ధిదారులు ఏడుగురు కూర్చునే సామర్థ్యం గల ఆటో, సరుకుల రవాణాకు మూడు చక్రాల ఆటో ట్రాలీ, ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు నాలుగు చక్రాల ఆటో, ట్రాక్టర్, ట్రాలీ తదితర యూనిట్ల కోసం ఆసక్తి కనబరిచారు. కొందరు మినీ డెయిరీ, వరి నాటు యంత్రం యూనిట్లను కోరారు. లబ్ధిదారుల కోరిన యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలు, మూడు, నాలుగు చక్రాల ఆటోలు, ట్రాలీ ఆటోలు, వరి నాటు వేసే యంత్రం తదితర యూనిట్ల కొనుగోలుకు సంబంధిత కంపెనీల నుంచి కొటేషన్లు తీసుకున్నారు. వీటిపై నిర్ణయం తీసుకొనే పనిలో అధికారులు తలమునకలయ్యారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న దళితబంధు పథకం ద్వారా తొలి విడుత అమలుకు జిల్లాలో ఎంపికైన లబ్ధిదారుల్లో కొందరికి యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ వెల్లడించారు. కేఎంసీలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో గురువారం లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు ఈ యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే కలెక్టర్ బీ గోపి దళితబంధు పథకం గ్రౌండింగ్ కమిటీ అధికారులతో సమావేశమై సమీక్ష చేశారు.