జిల్లాలో దళితబంధు యూనిట్ల అందజేతకు రంగం సిద్ధం
ఇప్పటికే 203 మందికి కోరిన యూనిట్ల మంజూరు
త్వరలోనే మరో వంద మందికి కూడా..
ట్రాన్స్ఫోర్ట్ రంగానికే లబ్ధిదారుల ప్రాధాన్యం
తొలివిడుత లబ్ధిదారుల పేర బ్యాంకు ఖాతాలు
ఏప్రిల్ మొదటి వారంలో పంపిణీకి ఏర్పాట్లు
దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు తొలివిడుత యూనిట్ల పంపిణీకి జిల్లాలో రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే ఎంపికైన వారిలో 203 మందికి కోరిన యూనిట్లు మంజూరయ్యాయి. దీంతో యూనిట్ల కొనుగోలుకు నిధులు విడుదల చేయనున్నారు. మరో వంద మందికి కూడా కోరిన యూనిట్లు మంజూరు చేయనున్నారు. జిల్లాలో తొలివిడతలో మొత్తం 303 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కొక్కరికి రూ.10లక్షల విలువైన యూనిట్ను వంద శాతం సబ్సిడీపై అందజేయనున్నారు. ఇప్పటికే యూనిట్ల ఎంపిక, నిర్వహణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం, బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయడం పూర్తయ్యింది. కలెక్టర్ బీ గోపి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. లబ్ధిదారులు యూనిట్ల ఎంపికలో ఆటోలు, ప్యాసింజర్ ఆటోరిక్షా, మూడు చక్రాల ఆటోట్రాలీ, నాలుగు చక్రాల ఆటోలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో యూనిట్లు పంపిణీ ప్రారంభించనున్నారు.
వరంగల్, మార్చి 30 : దళితబంధు పథకంలో జిల్లాలో తొలివిడుత యూనిట్ల అందజేతకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎంపికైన 203 మందికి కోరిన యూనిట్లను మంజూరు చేస్తూ ఇప్పటికే ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. ఈ మేరకు యూనిట్ల కొనుగోలు కోసం లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే పనిలో అధికారులు ఉన్నారు. మరో వంద మందికి కూడా కొద్ది రోజుల్లో కోరిన యూనిట్లను మంజూరు చేయనున్నారు. మార్చి నెలాఖరులోగా ఆయా నియోజకవర్గంలో దళిత బంధు పథకం ద్వారా తొలివిడత వంద మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేయాలని ఆదేశిస్తూ ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో అధికారులు షెడ్యూల్ ప్రకారం ఈ పథకం అమలుకు ప్రణాళిక రూపొందించారు. దళితబంధు పథకం తొలివిడుత అమలుకు ఆయా నియోజకవర్గం నుంచి ఎమ్మె ల్యే అందజేసిన వంద మంది లబ్ధిదారుల జాబితాను పరిశీలించి ప్రభుత్వానికి పంపారు. దశలవారీగా ఈ జాబితాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. జిల్లాలో 303 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10లక్షల విలువైన యూనిట్ను పంపిణీ చేసేందుకు అధికారులు ముందుకు వెళ్తున్నారు. దళిత బంధు పథకం తొలివిడత అమలుకు ఎంపికైన లబ్ధిదారులకు నియోజకవర్గం వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పథకం అమలు, బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయడం, యూనిట్ల వివరాలు, యూనిట్ల ఎంపిక, నిర్వహణపై అవగాహన కల్పించారు. కలెక్టర్ బీ గోపి పలు సూచనలు చేశారు.
లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్
కొద్దిరోజుల క్రితం జరిగిన అవగాహన హాజరైన నర్సంపేట, నల్లెబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, దుగ్గొండి, గీసుగొండ, సంగెం, వర్దన్నపేట, పర్వతగిరి, రాయపర్తి తదితర మండలాల్లోని 203మంది లబ్ధిదారులకు మంగళవారం ప్రభు త్వం యూనిట్లను మంజూరు చేసింది. ఒక్కో లబ్ధిదారుకు రూ.10లక్షలు కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ వెల్లడించారు. ఈ 203 మంది పేర బ్యాంకు ఖాతాలను తెరిచినట్లు ఆయన చెప్పారు. వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని మిగతా వంద మంది లబ్ధిదారుల పేర బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయటం, వారికి యూనిట్లను మంజూరు చేయడం ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసే పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. 303 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రూ.30.30కోట్ల విలువైన యూనిట్లను అందజేయనుంది. ఈ లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రాన్స్పోర్టు రంగానికే..
దళిత బంధు పథకం తొలివిడుతలో జిల్లాలోని లబ్ధిదారులు ట్రాన్స్పోర్టు రంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతున్నది. మంగళవారం ప్రభు త్వం మంజూరు చేసిన యూనిట్ల జాబితాను పరిశీలిస్తే ట్రాన్స్పోర్టు రంగానికి చెందినవే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దళితబంధు పథకం ద్వారా తొలివిడుత లబ్ధిదారులకు వ్యవసాయ, అనుబంధ పథకాలైన ట్రాక్టర్ కమ్ ట్రాలీ, ట్రాక్టర్, కోడిపిల్లల పెంపకం, వరి నాటువేసే యంత్రాలు, పందిరి కూరగాయల సాగు, ట్రాన్స్పోర్టు రంగంలో ఏడుగురు కూర్చునే ఆటోలు, ప్యాసింజర్ ఆటోరిక్షా, మూడు చక్రాల ఆటోట్రాలీ, ప్రయాణీకులు, సరుకు రవాణా చేసే నాలుగు చక్రాల ఆటోలను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్పత్తి పథకాల్లో ఐరన్ గేట్స్, గ్రిల్స్ తయారీ యూనిట్, కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రాలు, సిమెంటు ఇటుకలు, రింగుల తయారీ, సెంట్రింగ్, ఆర్సీసీ రూఫ్ మేకింగ్ యూనిట్, మట్టి ఇటుకల తయారీ, ఆటో ట్రాలీ, మడిగల నిర్మాణం, వ్యాపారం, ఆయిల్మిల్, వైట్ గ్రైండర్ బియ్యం, పిండి, పసుపు, కారం మిల్లులు, రిటైల్ దుకాణాల్లో మెడికల్, జనరల్ స్టోర్స్, మినీ సూపర్బజార్, ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకం, సేవలు, ఎలక్ట్రికల్ షాప్, మోటార్ వైండింగ్, హార్డువేర్, సానిటరీ దుకాణం, యాక్రిలిక్ షీట్లు, టైల్స్ వ్యాపారం, విత్తనాలు, ఎరువుల, పురుగుమందుల షాపు, వ్యవసాయ సాగుకు యంత్ర పరికరాలు, సేవలకు సంబంధించిన హోటల్, క్యాటరింగ్ సర్వీసు, డీటీపీ, మీసేవ, సీఎస్సీ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్, డయాగ్నోస్టిక్ ల్యాబ్, మెడికల్ షాపు, టెంట్ హౌస్, డెకరేషన్, లైటింగ్, సౌండ్ సిస్టమ్తోపాటు మరేదైనా లబ్ధిదారుఇష్ట ప్రకారం మంజూరు చేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు జిల్లాలో దళితబంధు పథకం తొలివిడత లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లు, ప్రభుత్వం మంజూరు చేసిన 203 యూనిట్ల జాబితాను పరిశీలిస్తే ట్రాన్స్పోర్టు రంగానికే మొగ్గుచూపినట్లు అధికారులు తెలిపారు.