రామాయంపేట/చిన్నశంకరంపేట/గంభీరావుపేట, ఆగస్టు 13: ‘యూరియా యాప్ మాకొద్దు’ అంటూ రైతులు గురువారం పలుచోట్ల ఆందోళనలకు దిగారు. మెదక్ జిల్లా రామాయంపేట, చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో రోడ్డెక్కి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయంలో సిబ్బందిని బంధించి, తాళం వేశారు.
యూరియా కోసం గురువారం ఉదయం రామాయంపేట సొసైటీ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన రైతులు మధ్యాహ్నం మూడు గంటలు దాటినా యాప్ ఓపెన్ కావడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు. సరైన సమాధానం రాకపోవడంతో రైతులు సొసైటీ కార్యాలయం ఎదుట మెదక్-రామాయంపేట రోడ్డుపై బైఠాయించారు.
యాప్ల పేరుతో ప్రభుత్వం తమకు ఎరువులు దొరుకకుండా చేస్తున్నదని మండిపడ్డారు. యూరియా బుకింగ్ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలోని మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాస్తారోకో చేపట్టారు. స్థానిక రామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటేనే యూరియా ఇస్తామని దుకాణం నిర్వాహకులు చెప్పడంతో అక్కడే మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
యాప్ ద్వారా అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్ విండోకు తరలివచ్చిన రైతులు కార్యాలయ సిబ్బందిని లోపల బంధించి, తాళం వేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తపల్లి సింగిల్ విండోలో 450 బస్తాల యూరియా అందుబాటులో ఉంటుందని, యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు తమ పనులు పక్కన పెట్టి యూరియా బుక్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
సాంకేతిక సమస్య కారణంగా యాప్ ఓపెన్ కాలేదు. ఆగ్రహించిన రైతులు సింగిల్ విండో కార్యాలయానికి చేరుకుని యాప్ ఓపెన్ కావడం లేదని సిబ్బందికి చెప్పగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో నిర్బంధించారు. పాత పద్ధతిలోనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ మారుతిరెడ్డి, వ్యవసాయాధికారి సలావుద్దీన్, ఎస్సై శ్రీకాంత్ రైతులకు నచ్చచెప్పి ధర్నా విరమింపచేసి సింగిల్ విండో కార్యాలయానికి వేసిన తాళం తీయించారు.